వాషింగ్టన్ డీసీలో వైభవంగా సంక్రాంతి వేడుకలు, ఘంటసాల శత జయంతి ఉత్సవాలు

వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం ఆధ్యర్యంలో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి వేడుకలు, ఘంటసాల శత జయంతి ఉత్సవాలలో సినీ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు.

Published : 07 Feb 2023 00:04 IST

వాషింగ్టన్‌: అమర గాయకుడు ఘంటసాల కారణజన్ముడు అని ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం ఆధ్యర్యంలో సంక్రాంతి వేడుకలు, ఘంటసాల శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇటీవల మరణించిన ప్రముఖ సినీనటి జమున, కళాతపస్వి కె.విశ్వనాథ్, నేపథ్య గాయని వాణి జయరాంలకు జీడబ్ల్యూటీసీఎస్‌ సభ్యులు సంతాపం తెలిపారు. వారి మృతి తెలుగుజాతికి, సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు.

అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘‘తెలుగు భాష, సంస్కృతీ సంప్రదాయాలను మేం మరిచిపోతున్నా, మీరు కొనసాగిస్తుండటం అభినందనీయం. ఘంటసాల శతజయంతి ఉత్సవాలు లాంటివి సినిమా వాళ్లుగా మేం చేయలేనందుకు సిగ్గుపడుతున్నాం. ఒక జాతి అస్తిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషేనని గుర్తుంచుకోవాలి. జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలు ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపాయి. ఇంత బాగా నిర్వహించిన సంస్థ అధ్యక్షులు కృష్ణ లాంకు అభినందనలు’’ అని ప్రశంసించారు. ఈ సందర్భంగా కృష్ణ లాం మాట్లాడుతూ.. ‘‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు సంగీత సామ్రాజ్యానికి రారాజు ఘంటసాల. ఆయన ఆలపించిన భగవద్గీత నభూతో నభవిష్యత్. అలాంటి మహనీయుని శతజయంతి ఉత్సవాలు జరుపుకొనే అవకాశం రావడం మన అదృష్టం. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో అనేక సేవా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహించుకున్నాం. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడ అందరం కలుసుకుని ఈ పండుగను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. 
భారత రాయబార కార్యాలయ ఉన్నతాధికారి రవి కోట మాట్లాడుతూ.. సంక్రాంతి అంటే తెలుగు సంస్కృతిని, పల్లె క్రాంతిని దర్శించుకోవడమని.. మన తెలుగువారి పండుగైన సంక్రాంతి ప్రజలకు ఎన్నో అనుభూతులను మిగులుస్తుందన్నారు.

ఏ జాతైతే తన మాతృభాషను, సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతుందో ఆ జాతి అంతరించిపోతుందని మన్నవ సుబ్బారావు అన్నారు. డాక్టర్ ముల్పూరి వెంకట్రావు మాట్లాడుతూ.. సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండుగని.. ఈ పర్వదిన విశిష్టతను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని గుర్తు చేశారు. అనంతరం తానా బోర్డు మాజీ అధ్యక్షులు నరేన్ కొడాలి, అనిల్ ఉప్పలపాటి తదితరులు ప్రసంగించారు. తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన ఫోన్ ద్వారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
సంక్రాంతికి మరింత వన్నె తెచ్చేలా చేసిన అలంకరణలు ఆకట్టుకున్నాయి. రంగవల్లులు, ముగ్గుల పోటీలు, పెళ్లిభోజనాలను తలపించేలా తాంబూలంతో కూడిన సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. 

కార్యక్రమంలో సంస్థ పూర్వాధ్యక్షులు సత్యనారాయణ మన్నె, రవి గవిరినేని, సాయిసుధ పాలడుగు, కిషోర్ తంగేటి, జీడబ్ల్యూటీసీఎస్ కార్యవర్గ సభ్యులు సుశాంత్ మన్నె, విజయ్ అట్లూరి, సుష్మ అమృతలూరి, కార్తీక్ కోమటి, రవి అడుసుమిల్లి, శ్రీవిద్య సోమ, భాను మాగులూరి, యాష్ బొద్దులూరి, చంద్ర మలావతు, రాజేష్ కాసరనేని, ఉమాకాంత్ రఘుపతి, ఫణి తాళ్లూరి, శ్రీనివాస్ గంగ, ప్రవీణ్ కొండక, రమాకాంత్ కోయ, రామ్ చౌదరి ఉప్పుటూరి, విజయ్ గుడిసేవ, సాయి బొల్లినేని తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని