శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ‘శివ భక్తి గీతాలాపన

‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ‘శివ భక్తి గీతాలాపన’ ప్రత్యేక కార్యక్రమాన్ని అంతర్జాల వేదికగా నిర్వహించారు.

Published : 23 Feb 2023 20:10 IST

సింగపూర్‌: ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ‘శివ భక్తి గీతాలాపన’ ప్రత్యేక కార్యక్రమాన్ని అంతర్జాల వేదికగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ ‘ఇటీవల శివైక్యం చెందిన ప్రముఖ నటి జమున, కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి నివాళిగా ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నాం. మా సంస్థ గతంలో చేసిన ఎన్నో కార్యక్రమాలకు అతిథిగా విచ్చేసి ఆప్యాయంగా ఆశీస్సులు అందించారు’ అని అన్నారు. అనంతరం సింగపూర్‌లో నివసించే గాయనీ గాయకులు శివ భక్తి కీర్తనలను మధురంగా ఆలపించారు. వాటిలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, దయానంద సరస్వతి విరచిత కీర్తనలు, లలిత గీతాలు, కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘సాగర సంగమం’, ‘శంకరాభరణం’ జమున నటించిన నాగులచవితి చిత్రాల నుంచి పలు పాటలను ఎంపిక చేసి ఆలపించడం విశేషం.

ఇక ఆత్మీయ అతిథిగా వంశీ వ్యవస్థాపకులు శిరోమణి డా.వంశీ రామరాజు పాల్గొని శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. వంశీ గౌరవాధ్యక్షురాలు అయిన జమున, కె.విశ్వనాథ్‌లతో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి పేర్లపై త్వరలో అవార్డులు స్థాపించి కళాకారులను ప్రోత్సహిస్తామని తెలియజేశారు.

రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా గాయనీ గాయకులుగా శైలజ చిలుకూరి, సౌభాగ్య లక్ష్మి తంగిరాల, శేషు కుమారి యడవల్లి, శేషశ్రీ వేదుల, రాధిక నడాదూర్, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, అనంత్ బొమ్మకంటి, ఉషా గాయత్రి నిష్ఠల, పద్మజ వేదుల, కిరీటి దేశిరాజు తదితరులు వివిధ శివ భక్తి సంకీర్తనలను మధురంగా ఆలపించారు. రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సారథ్యంలో యూట్యూబ్, ఫేస్‌బుక్‌ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. కార్యక్రమాన్ని క్రింది లింకు ద్వారా వీక్షించవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని