గల్ఫ్ కార్మికులతో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆత్మీయ సమ్మేళనం

ఇండియన్ పీపుల్స్ ఫోరం (దుబాయ్‌) తెలంగాణ కౌన్సిల్ ఆధ్వర్యంలో దుబాయ్‌లోని ఆల్కుజ్ ప్రాంతంలోని అంబాసిడర్ స్కూల్లో ఆదివారం సాయంత్రం తెలంగాణ గల్ఫ్ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Updated : 07 Mar 2023 00:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్ పీపుల్స్ ఫోరం (దుబాయ్‌) తెలంగాణ కౌన్సిల్ ఆధ్వర్యంలో దుబాయ్‌లోని ఆల్కుజ్ ప్రాంతంలోని అంబాసిడర్ స్కూల్లో ఆదివారం తెలంగాణ గల్ఫ్ కార్మికులతో ఆత్మీయ సమ్మేశనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా విదేశీ వ్యవహారాల శాఖ ఇంఛార్జి డాక్టర్ విజయ్ చౌతైవాలే, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇండియన్ పీపుల్స్ ఫోరం యూఏఈ అధ్యక్షుడు జితేంద్ర వైద్య అధ్యక్షత వహించారు. ఫోరం ప్రధాన కార్యదర్శి రంజీత్ కోడోత్ అతిథిగా పాల్గొన్నారు. ఫోరం తెలంగాణ విభాగం అధ్యక్షుడు కుంభాల మహేందర్ రెడ్డి స్వాగత ఉపన్యాసం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐపీఎఫ్) భాగం కావడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జాతి నిర్మాణానికి తోడ్పడాలని ప్రవాసీయులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్‌ దేశాలలోని ప్రవాస భారతీయుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బుర్జ్ ఖలీఫాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇళ్లు కొనుక్కొంటూ కొందరు తెలంగాణ నాయకులు ధనవంతులైతే, పేద ప్రజలు మాత్రం గూడు కోసం విదేశాలకు వస్తున్నారని అర్వింద్‌ వ్యాఖ్యానించారు. ప్రవాసీ బీమా యోజన పథకంలో భాగంగా గల్ఫ్ ప్రవాసీయుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కానీ దీన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి అమలు చేయడంలో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేవలం రూ.325 బీమా కింద ప్రవాసీయులకు, స్వదేశంలోని వారి కుటుంబాలకు వైద్య సదుపాయంతో పాటు గల్ఫ్‌లో న్యాయసాయం వరకు అన్ని రకాల ముఖ్య సేవలను కేంద్రం అందిస్తుందని వివరించారు. మోదీ ప్రధానిగా కాకుండా ఒక పేదవాడిగా అలోచించడంతో ఈ రకమైన సేవలను ప్రవాసీ బీమా యోజన కింద తీసుకువచ్చారని అన్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న తన కాల్‌ సెంటర్ ద్వారా వేలాది మందికి తాను ఒక్కడినే సహాయం చేయగలిగినప్పుడు, ప్రభుత్వం ఎందుకు చేయరాదని ఆయన ప్రశ్నించారు. గల్ఫ్ దేశాల నుంచి తాను ఇప్పటి వరకు 4,700 తెలంగాణ ప్రవాసీయులను స్వదేశానికి రప్పించానని, అదే విధంగా తన ఫౌండేషన్ ద్వారా 1700 మంది రోగులకు వైద్య సహాయం అందించానని ఎంపీ వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ పలు రాజకీయ విమర్శలు చేశారు. 

భాజపా కేంద్ర కార్యాలయంలో విదేశీ వ్యవహారాల విభాగం నెలకొల్పారని, అందులో నలుగురు సభ్యులుండగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తనను ఎంపిక చేశారని అర్వింద్‌  వెల్లడించారు. సభ జరుగుతుండగా, నమాజు వేళ కావడంతో అజాన్ మొదలు కాగా ప్రధాని మోదీ తరహా తాను కూడా నమాజును గౌరవిస్తూ ప్రసంగాన్ని ఆపుతున్నట్లుగా ప్రకటించి మౌనంగా ఉన్నారు. ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐపీఎఫ్‌) తెలంగాణ విభాగం నిర్వహించిన ఈ సమావేశానికి తెలంగాణ ప్రవాసీయుల నుంచి అనూహ్యస్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో కటుకం రవి, వంశీ గౌడ్, నవనీత్ పటేల్, శరత్ గౌడ్, మదన్, జగదీశ్, గోవర్దన్, వినోద్ ఆర్మూరీ, కోరేపు మల్లేష్, పెంకుల ఆశోక్, దీపికా శ్రీనివాస్, రమేష్ గదార్ల , మేగీ కృష్ణహరి, రేండ్ల శ్రీనివాస్‌తో పాటు పాటు సుమారు 1300 మంది గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని