Andhra News : గురుకులం టు వైట్‌హౌస్

ప్రతిభకు ఎల్లలుండవని రుజువు చేసింది బాపట్ల గురుకులం విద్యార్థిని అక్ష. పేద కుటుంబానికి చెందిన బాలిక చదువులో ప్రతిభ చూపి ఏకంగా విదేశాలకు వెళ్లే అవకాశం దక్కించుకుంది.

Updated : 25 Mar 2023 09:33 IST

అమెరికాలో ఇంటర్‌ చదువుతున్న బాపట్ల విద్యార్థిని అక్ష
తాజాగా మరో అరుదైన అవకాశం దక్కించుకున్న వైనం
బాపట్ల, న్యూస్‌టుడే

ప్రతిభకు ఎల్లలుండవని రుజువు చేసింది బాపట్ల గురుకులం విద్యార్థిని అక్ష. పేద కుటుంబానికి చెందిన బాలిక చదువులో ప్రతిభ చూపి ఏకంగా విదేశాలకు వెళ్లే అవకాశం దక్కించుకుంది. బాపట్ల గురుకులంలో చదివే విద్యార్థిని ప్రస్తుతం అమెరికాలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతోంది. తరగతి గదిలో చలాకీగా ఉంటూ కష్టపడి చదువుతూ తాజాగా అమెరికా అధ్యక్ష భవన కార్యాలయం వైట్హౌస్‌ నుంచి ఆహ్వానం అందుకుని సందర్శించింది. పేదరికం వంటి సమస్యలున్నా, కష్టపడి చదివి మంచి అవకాశాలు అందిపుచ్చుకొని అక్ష పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

కొమరాబత్తిన అక్ష స్వస్థలం పర్చూరు మండలం చెరుకూరు. తండ్రి మరియరాజు టీ కొట్టు నిర్వహిస్తుండగా, తల్లి రత్నకుమారి దర్జీగా పని చేస్తున్నారు. బాపట్ల మండలం నరసాయపాలెం గురుకులంలో 9, 10 తరగతులు చదివింది. ప్రిన్సిపల్‌ వినీత విద్యార్థినిలో ప్రతిభ గుర్తించి ప్రోత్సహించారు. పదో తరగతి ఫలితాల్లో 9.8 జీపీఏ సాధించింది. 2021లో బాపట్ల బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో చేరింది. 80 శాతానికి పైగా మార్కులు సాధించింది. అమెరికాలో పది నెలలు సీనియర్‌ ఇంటర్‌ విద్యను అభ్యసించటానికి కెనడీ లిగర్‌ యూత్‌ ఎక్స్ఛేంజ్‌ స్టడీ(కేఎల్‌వైఈఎస్‌) కింద కేంద్రం నీతిఅయోగ్‌ ద్వారా ఏటా 35 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి పంపించగా అందులో అక్ష ఒకరు. విద్యార్థిని చదువుకయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తోంది. రానున్న జూన్‌లో ద్వితీయ ఇంటర్‌ పూర్తి చేయనుంది.

ముగ్గురిలో ఒకరు

నీతి ఆయోగ్‌ ద్వారా విదేశాల్లో చదివేందుకు ఏపీ నుంచి ఎంపికైన ముగ్గురిలో అక్ష ఒకరు. గత ఆగస్టులో అమెరికా వెళ్లింది. వాషింగ్టన్‌ బ్రెమెర్టన్‌ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం సీనియర్‌ ఇంటర్‌ చదువుతోంది. సెమినార్లలో చురుగ్గా పాల్గొని బాగా చదివి విద్యలో రాణిస్తూ ప్రతిభావంతురాలైన విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది. భారతదేశం నుంచి వాషింగ్టన్‌లో చదువుతున్న 35 మంది విద్యార్థినుల్లో ముగ్గురికి అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించే అవకాశం రాగా అందులో అక్ష ఒకరు. అమెరికా విదేశాంగ ప్రతినిధులు విద్యార్థినికి స్వాగతం పలికారు. కుమార్తె వైట్‌హౌస్‌ సందర్శించడంపై ఆమె తల్లిదండ్రులు మరియరాజు, రత్నకుమారి ఆనందం వ్యక్తం చేశారు.

అమెరికాలో సహచర విద్యార్థులతో అక్ష

అవకాశాల గని అమెరికా: అక్ష  

ప్రతిభావంతులకు అమెరికా అవకాశాల గని. మారుమూల గ్రామానికి చెందిన నేను ఇక్కడికి వచ్చి చదువుతున్నానంటే ఇప్పటికి కలగానే ఉంది. విద్య, ప్రతిభ వల్లే అది సాధ్యమైంది. ప్రతిభకు ఎల్లలు లేవు. వాషింగ్టన్‌ బ్రెవెర్టన్‌ ఉన్నత పాఠశాలలో సీనియర్‌ ఇంటర్‌ చదవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడి విద్యా విధానం బాగుంది. ఆత్మ విశ్వాసం పెరిగింది. మనో వికాసం కలిగింది. విద్యార్థులంతా ఎంతో కలివిడిగా, స్నేహంగా ఉంటున్నారు. గురువులు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. కష్టపడి చదువుతూ ఉన్నత స్థాయికి ఎదగాలన్నా కలలు సాకారం చేసుకుంటున్నా. అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్‌ సందర్శనకు పిలుపు రాగానే గొప్ప సంతోషం కలిగింది. విదేశాంగ శాఖ అధికారులు సాదరంగా ఆహ్వానించి అభినందించిన తీరు జీవితాంతం గుర్తుండి పోతుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత స్వదేశానికి వచ్చి డిగ్రీ చదివి మరలా ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్తా. ఉన్నత విద్య అమ్మాయిల జీవితంలో వెలుగులు నింపుతుంది. ప్రతిఒక్కరూ కష్టపడి చదివి వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవాలి. జీవితంలో ఎదుగుదలకు బాటలు వేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని