TANA: తానా ఆదరణ కింద మహిళలకు 100 కుట్టుమిషన్లు పంపిణీ

పుట్టగుంట సురేష్‌ ఆర్థిక సహాయంతో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. రాఖీ పండుగను పురస్కరించుకుని గద్దె రామ్మోహన్‌ తన సొంత నిధులతో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 

Updated : 03 Sep 2023 17:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి తెలిపారు. విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ చేస్తున్న సేవలకు తోడుగా... తానా కూడా సేవ, సహాయ కార్యక్రమాలు చేస్తోందని చెప్పారు. పుట్టగుంట వీరభద్రరావు జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు తానా ఫౌండేషన్‌ ట్రస్టీ పుట్టగుంట సురేష్‌ ఆర్థిక సహాయంతో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. గురువారం సాయంత్రం బెంజి సర్కిల్‌ సమీపంలోని ఎస్‌.వి.ఎస్‌ కల్యాణ మండపంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. అలాగే రాఖీ పండుగను పురస్కరించుకుని గద్దె రామ్మోహన్‌ తన సొంత నిధులతో మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శశికాంత్‌ వల్లేపల్లి మాట్లాడుతూ తెలుగువారిగా పుట్టి అమెరికాలో స్థిరపడి తెలుగు రాష్ట్రాలోని ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఏటా ఐ-క్యాంపులు, మెడికల్‌ క్యాంపులతో పాటు, రవి సామినేని సహకారంతో ఆదరణ ద్వారా అనేక మందికి ట్రై సైకిల్స్‌ అందజేసినట్లు తెలిపారు. గద్దె రామమోహన్‌ ఇక్కడ ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తున్నారని, ఆయన సేవలకు తోడ్పాటు అందించేందుకు పుట్టగుంట సురేష్‌ రూ.6.5 లక్షలతో కుట్టు మిషన్లు అందజేశారని చెప్పారు. 

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ ‘‘మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు, వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు తానా ఆర్థిక సహాయం చేయడం అభినందనీయం. జన్మభూమికి సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో సేవ చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అనేక మంది పేదలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వైద్య ఖర్చులు కూడా అందిస్తున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా ఇలాంటి సేవలు చేస్తున్న తానా కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి’’ అని తానా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. 

విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పుట్టగుంట వీరభద్రరావు జ్ఞాపకార్థం ఇంత పెద్దఎత్తున కుట్టుమిషన్లు అందజేసిన పుట్టగుంట సురేష్‌కు, తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున గద్దె రామ్మోహన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, పుట్టగుంట రమేష్‌, చెన్నుపాటి కాంతిశ్రీ గాంధీ, ముమ్మనేని ప్రసాద్‌, చెన్నుపాటి ఉషారాణి, పొట్లూరి సాయిబాబు, రాయి రంగమ్మ, నందిపాటి దేవానంద్‌, ఎం.దేవేంద్ర, రత్నం రమేష్‌, చిప్పాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని