TANA : తానా ప్రపంచసాహిత్య వేదిక ఆధ్వర్యంలో త్వరలో ప్రముఖ కవి కొసరాజు సమగ్ర సాహిత్యం

సుప్రసిద్ధ కవి, రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి సమగ్ర సాహిత్యాన్ని తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలో ముద్రించి త్వరలో తెలుగు భాషాభిమానులకు, సాహితీప్రియులకు అందజేయనున్నామని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు తెలిపారు.

Updated : 28 Oct 2023 15:46 IST

డెట్రాయిట్, అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆద్వర్యంలో ప్రముఖ సినీ కవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యాన్ని సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో మొత్తం ఆరు సంపుటాలలో ముద్రించి సిరివెన్నెల అభిమానులకు, సాహితీ ప్రియులకు ఇటీవలే కానుకగా అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే స్ఫూర్తితో సుప్రసిద్ధ కవి, రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి సమగ్ర సాహిత్యాన్ని తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలో ముద్రించి త్వరలో తెలుగు భాషాభిమానులకు, సాహితీప్రియులకు అందజేయనున్నామని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు తెలిపారు. కొసరాజు 37వ వర్ధంతి (అక్టోబర్ 27) సందర్భంగా ఈ విషయాన్ని ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఇది తానా సంస్థ ఒక మహాకవికి ఇచ్చే ఘన నివాళిగా నిలుస్తుందని ఆయన అన్నారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “దాదాపు నాలుగు దశాబ్దాలుగా సాగిన కవిరత్న, జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి సాహితీ ప్రయాణంలో ‘ఏరువాక సాగాలోరన్న’, ‘అయయో చేతిలో డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే’, ‘భలే ఛాన్సులే భలే ఛాన్సులే, ఇల్లరికంలో ఉన్న మజా’, ‘సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు కాల్చు సిగరెట్టు’, ‘రామయతండ్రి, ఓ రామయ తండ్రి, మానోములన్ని పండినాయి రామయ తండ్రీ’, ‘ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, అలుపూ సొలుపేమున్నది’ లాంటి పాటలలో అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టు భాషలోని చమత్కారాలు, విరుపులు కొసరాజు కలం నుంచి రెండు వందల చిత్రాలలో వెయ్యికి పైగా పాటలు జాలువారాయి. కేవలం సినిమా పాటలేగాక కొసరాజు “గండికోట యుద్ధం” అనే ద్విపద కావ్యం, “కడగండ్లు” అనే పద్యసంకలనం, “కొసరాజు విసుర్లు”, “కొండవీటి చూపు”, “నవభారతం”, “భానుగీత” లాంటి గ్రంథాలు, యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ల పాటలు, రజకుల పాటలు, పాములోళ్ల పాటలు, గంగిరెద్దుల గీతాలు లాంటవి ఎన్నో రాశారు’’ అని అన్నారు.

ఈ సందర్భంగా కొసరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎన్నో విషయాలను ఇప్పటికే సేకరించామని డా.ప్రసాద్ తోటకూర తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కొసరాజు కుటుంబసభ్యులకు.. ఈ సమగ్ర సాహిత్యాన్ని త్వరలో తెలుగు ప్రజలకు అందించే సాహితీ మహాయజ్ఞంలో ప్రముఖ పాత్ర పోషించనున్న ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకులు అశోక్ కుమార్ పారా (మనసు ఫౌండేషన్)కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని