డెట్రాయిట్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళల దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్‌లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది.

Updated : 07 Mar 2024 00:20 IST

డెట్రాయిట్‌: అంతర్జాతీయ మహిళల దినోత్సవం (మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్‌లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం (మార్చి 2) నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ సంతతికి చెందిన జిల్లా న్యాయమూర్తి జస్టిస్ షాలినా కుమార్ మాట్లాడుతూ.. అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో భారతీయ మహిళలు అందిస్తున్న ఎనలేని సేవలను, కనబరుస్తున్న విశేష ప్రతిభా పాటవాలను కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగాలని సూచించారు. 

ముఖ్య వక్తగా విచ్చేసిన ఆచార్య పద్మజ నందిగామ మాట్లాడుతూ..  మహిళలు కుటుంబం కోసం రోజూ నిర్వహించే సేవలు వెల కట్టలేనివని అన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు సుష్మ పదుకొనే, సుమ కల్వల మాట్లాడుతూ.. అమెరికా వ్యాప్తంగా ఉన్న తమ సంఘం వనితా బృందాలు రాబోయే రోజుల్లో మహిళా దినోత్సవ కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమ నిర్వహణకు సహకరించిన కమిటీ సభ్యులు సుష్మ పడుకోనె, స్వప్న చింతపల్లి, సుమ కల్వల, దీప్తి వెనుకదాసుల, దీప్తి లచ్చిరెడ్డిగారి, హర్షిణి బీరపు, అర్పిత భూమిరెడ్డి, కల్యాణి ఆత్మకూరు, శిరీషారెడ్డి, డాక్టర్ అమిత కాకులవరం తదితరులను జీటీఎ డెట్రాయిట్ కార్యవర్గం అభినందించింది. డెట్రాయిట్‌లో వేడుకలను విజయవంతం చేయడానికి సహకరించిన జీటీఏ ఛైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కలువల, అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి, జీటీఏ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు పలువురు ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో సుమారు 350 మంది విభిన్న భాషా సంస్కృతులకు చెందిన భారతీయ మహిళలు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించారు. భారతీయ వంటకాలు కార్యక్రమానికి హాజరైన వారిని ఎంతగానో ఆకర్షించాయి. శ్రీకాంత్ సందుగు పాటలతో ప్రేక్షకులను అలరించారు. వ్యాఖ్యాత సాహిత్య వింజమూరి తనదైన శైలి మాటలతో ఆకట్టుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని