Houston: మా ఊరు రాజమండ్రిలో గాంధీని చూశా

‘‘మహాత్మాగాంధీని ప్రత్యక్షంగా చూసిన అమెరికాలోని అతికొద్దిమంది వ్యక్తుల్లో నేనొకణ్ని. 1946లో మహాత్ముడు మా సొంత ఊరైన రాజమండ్రికి వచ్చినపుడు నా వయసు తొమ్మిదేళ్లు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది.

Updated : 18 Jan 2023 07:32 IST

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ గ్రాండ్‌ పరేడ్‌ స్పెషల్‌ అవార్డు గ్రహీత కృష్ణ వావిలాల

హ్యూస్టన్‌: ‘‘మహాత్మాగాంధీని ప్రత్యక్షంగా చూసిన అమెరికాలోని అతికొద్దిమంది వ్యక్తుల్లో నేనొకణ్ని. 1946లో మహాత్ముడు మా సొంత ఊరైన రాజమండ్రికి వచ్చినపుడు నా వయసు తొమ్మిదేళ్లు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది. గాంధీని చూసేందుకు మా అమ్మమ్మ నన్ను, నా ఇద్దరు సోదరీమణులను ఎడ్లబండిపై పిలుచుకుపోయింది’’ అని ఇండో - అమెరికన్‌ కృష్ణ వావిలాల (86) తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గత అయిదు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న ఈయన భారతీయులు, అమెరికన్ల మధ్య సుహృద్భావ సంబంధాల ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. అమెరికన్‌ మానవహక్కుల నేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (ఎంఎల్‌కే) జూనియర్‌ జయంతి (జనవరి 15) సందర్భంగా కృష్ణ వావిలాలకు ఎంఎల్‌కే గ్రాండ్‌ పరేడ్‌ స్పెషల్‌ అవార్డు అందజేశారు. హ్యూస్టన్‌లో నివాసం ఉంటున్న కృష్ణ బిట్‌్్స పిలాని పూర్వ విద్యార్థి. ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పదవీ విరమణ పొంది, ‘ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా స్టడీస్‌’ (ఎఫ్‌ఐఎస్‌) సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. గాంధీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌ అనుసరించిన అహింస విధాన వ్యాప్తికి గతంలో అమెరికాలో జరిగిన పలు గ్రాండ్‌ పరేడ్‌లలో ఈయన మహాత్ముడి వేషధారణలో పాల్గొని ప్రచారం చేశారు. గత ఆదివారం రాత్రి ఘనంగా జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ఎంఎల్‌కే జూనియర్‌ పరేడ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌, సీఈవో అయిన చార్లెస్‌ స్టాంప్స్‌ అవార్డు ట్రోఫీతోపాటు జ్ఞాపికను కృష్ణ వావిలాలకు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘‘దైనందిన జీవితంలో భారతీయులకు, ఇక్కడున్న నల్ల జాతీయులకు మధ్య మొదట్లో సామాజిక సంబంధాలు చాలా తక్కువగా ఉండేవి. ఈ విషయాన్ని గమనించిన నేను ఈ పరిస్థితిని మార్చేందుకు ఎంతోకొంత చేయాలని నిర్ణయించుకున్నా. 2003-04లో హెర్మన్‌ పార్కులో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఎంఎల్‌కే పరేడ్‌లలో పాల్గొనేలా నాకు స్ఫూర్తినిచ్చింది. ప్రవాస భారతీయులు అందరూ ఈ కవాతుల్లో పాల్గొనాలి’ అని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని