హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

తెలుగు సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఆంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Published : 24 Feb 2023 00:29 IST

హాంకాంగ్‌: తెలుగు సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా ‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా జరిగింది. చిన్నారులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని తెలుగు భక్తి గీతాలు, పద్యాలు, పాటలు, సంప్రదాయ సమకాలీన జానపద నృత్యాలు ప్రదర్శించారు. చిన్నారులు తేజస్వి సారంగా, వరుణ్‌ నాల్గె వ్యాఖ్యతలుగా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. పూర్వ కార్యదర్శి మిరియాల బాలకిశోర్‌ చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విదేశాల్లో ఉంటూ పిల్లలకు మాతృభాష, సంప్రదాయాలను నేర్పిస్తున్న తల్లిదండ్రులను ఆయన అభినందించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి సభకు కృతజ్ఞతలు తెలిపారు. సమాఖ్య కార్యవర్గ సభ్యులు బాల కిశోర్‌, రాజశేఖర్‌ మన్నె, రమాదేవి సారంగా, కొండ మాధురి, హర్షిణి పచ్చటి కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారుల తల్లిదండ్రులను అభినందించారు.

అనంతరం హాంకాంగ్‌ బాంగ్లాదేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఫిబ్రవరి 21 భాషోధ్యమ దినోత్సవం’’ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జయ పీసపాటి పాల్గొన్నారు. బంగ్లాదేశ్ అసోసియేషన్ ఆఫ్ హాంకాంగ్‌ అధ్యక్షులు సయ్యద్ మోహి ఉద్దీన్ మోహి, ముఖ్య అతిథి ఇసరత్ ఆరాతో పాటు హాంకాంగ్‌ ప్రభుత్వ అధికారులు, హాంకాంగ్‌ అసోసియేషన్  గ్లోకల్ పీస్ సెంటర్ ఉపాధ్యక్షురాలు మిటజీ లీయోంగ్, కమిటీ సభ్యుడు తిరుపతి నాచియప్పన, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రధాన ప్రతినిధులను సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బంగ్లాదేశ్ కౌన్సిల్ జనరల్ ఇసరత్ ఆరా మాట్లాడుతూ.. భాష సమాన హోదా కోసం చేసిన ఉద్యమం గురించి వివరించారు. ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం ఢాకా నగరంలో ర్యాలీలను నిషేధించిందని, ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు, సాధారణ ప్రజల సహకారంతో భారీ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రపంచంలోనే భాష కోసం ఇంత పెద్ద ఉద్యమం చేసిన ఘనత బంగ్లాదేశ్‌కు మాత్రమే చెందుతుందని తెలిపారు. ఉద్యమం కోసం ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. చరిత్రలో ఇది చాలా అరుదైన సంఘటన అని, ప్రజలు తమ మాతృభాష కోసం ప్రాణాలను అర్పించారన్నారు. మిటజీ లీయోంగ్ మాట్లాడుతూ యునెస్కో చేపట్టిన మాతృభాష పరిరక్షణ కార్యక్రమం గురించి వివరించారు. జయ పీసపాటి మాట్లాడుతూ.. తాము గతేడాది జూమ్ మాధ్యమం ద్వారా నిర్వహించిన అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవంలో భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలతో కలిపి 16 భాషలకు చెందిన చిన్నారులు పాల్గొన్నారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని భాషలను కలిపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇతర అతిథులు తమ మాతృ భాష ప్రాముఖ్యత, కార్యక్రమాల గురించి తెలిపారు. అనంతరం పిల్లలు దేశభక్తి గీతాలు పాడారు. BAHK జనరల్ సెక్రెటరీ రహమాన్ పలాష్ వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని