అమెరికాలో అంగరంగ వైభవంగా మహా శివరాత్రి వేడుకలు

అమెరికాలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. న్యూజెర్సీ దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఆరు వేల మందికి పైగా భక్తజనం తరలివచ్చారు.

Published : 20 Feb 2023 22:38 IST

ఎడిసన్: అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తోన్న న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో ఈ నెల 18, 19 తేదీల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. శివ విష్ణు ఆలయంలో కొలువై ఉన్న పంచముఖ పరమేశ్వరుని, అమరేశ్వర స్వామిని వేలాదిగా భక్తులు విచ్చేసి రెండు రోజుల పాటు పూజలు చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ కాల అభిషేకాలలో బిల్వ అష్టోత్తర శతనామార్చన, 11సార్లు రుద్ర పారాయణ, సహస్రనామార్చన, లలితా రుద్ర త్రిశతి నామార్చన, నందీశ్వర పూజ, హారతి, మంత్రపుష్ప పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. సాయంత్రం శివపార్వతుల కళ్యాణాల్లో న్యూ జెర్సీ, న్యూ యార్క్, ఫిలడెల్ఫియా రాష్ట్రాల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తజనం తరలి వచ్చి స్వామి, శ్రీమాత కృపకు పాత్రులయ్యారని సాయి దత్త పీఠం వ్యవస్థాపకులు రఘుశర్మ శంకరమంచి తెలిపారు. ఈ వేడుకల్లో దాదాపు 6వేల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్టు చెప్పారు. 

భక్తులందరికీ అన్నదాన టీం మహా ప్రసాదాన్ని పంపిణీ చేసింది. ఆలయంలో ప్రతిష్ఠాత్మక కల్పతరువు ఆకృతి నిర్మాణం భక్తుల సందర్శనార్థం దిగ్విజయంగా ఏర్పాటు చేసింది. ఎడిసన్‌లో సాయి దత్త పీఠం నిర్మించిన శ్రీ శివ, విష్ణు ఆలయ అభివృద్ధి కోసం చేపట్టిన ఈ కల్పతరువు కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. కల్పతరువు కార్యక్రమంలో భాగంగా విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను లోహపు రేకులపై ఆకుల రూపంలో చెక్కి ఆ ఆకులతో కల్పవృక్ష ఆకృతిని రూపొందించారు. ఈ ఆకృతిని ఆలయ గోడపై ప్రతిష్ఠింపజేశారు. ఇలా ఆ దేవదేవుడికి విరాళాలు ఇచ్చిన వారి వివరాలు చిరకాలం నిలిచిపోయేలా ఉంటుందని, నేటివరకు పాల్గొన్న దాతల వివరాలు లోహపు రేకులపై ఏర్పాటు చేశామని.. ఇంకా పాల్గొనని భక్తులకు ఇదొక సువర్ణావకాశమని తెలిపారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షంలా ఉండాలనేది సాయిదత్త పీఠం ఆకాంక్ష అని రఘుశర్మ శంకరమంచి అన్నారు. కల్పతరు వృక్షానికి పూజలు చేసి భక్తులు సాయి దత్తపీఠంపై చూపిస్తున్న ఆదరణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని