NATS: ఆకస్మిక గుండెపోటు.. నాట్స్ అవగాహన సదస్సు

ఆకస్మిక గుండెపోటుకు గురై యువత సైతం కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్న వేళ నాట్స్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించింది.

Published : 27 Mar 2023 20:45 IST

అమెరికా: ఇటీవల ఆకస్మిక గుండెపోటుతో మరణాలు పెరుగుతుండటం కలవరపెడుతున్న విషయం తెలిసిందే.  ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఇంటర్నెట్‌ వేదికగా వెబినార్ నిర్వహించింది. అమెరికాలోని ప్రముఖ కార్డియాలజిస్ట్ గుడిపాటి చలపతిరావు ఈ సదస్సులో ప్రధానంగా అసలు ఆకస్మిక గుండెపోటు ఎందుకు వస్తుందనే విషయంపై అవగాహన కల్పించారు. జీవన శైలిలో మార్పులే ఈ గుండెపోట్లకు ప్రధాన కారణమని తెలిపారు. మనం తినే ఆహారం సరిగా లేకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం.. వారసత్వంగా వచ్చే వ్యాధుల వల్ల గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయని వివరించారు. ముఖ్యంగా భారత్‌లో ఇలాంటి కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందని గుడిపాటి చలపతిరావు గణాంకాలతో సహా వివరించారు. జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే ఆకస్మిక గుండెపోట్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్నారు.

ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో మంచిదన్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని ప్రముఖ వైద్యులు మధు కొర్రపాటి సూచించారు. పెరుగన్నం, చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. తెల్ల అన్నానికి బదులుగా మిలెట్స్, ఓట్స్, బ్రౌన్ రైస్‌లాంటివి వాడొచ్చని తెలిపారు. కూరగాయలు, పండ్లు ఆహారంలో ఎక్కువగా ఉండాలని.. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని మధు కొర్రపాటి సూచించారు. గుండెపోటు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉండేవాళ్లు ఎలా స్పందించాలనే అంశాన్ని డాక్టర్ మాధురి అడబాల వివరించారు. సీపీఆర్ ఎలా చేయాలనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి విజయ్ అన్నపరెడ్డి వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణ అట్లూరి గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ గంటి సూర్యం, డాక్టర్ బీఎస్ఆర్ మూర్తి, డాక్టర్ దాసరి సతీష్‌ కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి టీఏజీడీవీ, టీఎఫ్ఏఎస్, టామ్, వాషింగ్టన్ తెలుగు సోసైటీ, టాంటెక్స్, ఉజ్వల ఫౌండేషన్, సహృదయ ఫౌండేషన్, జింకానా రన్ ఇన్ ఇండియా, హిందూ అమెరికన్ సోసైటీ ఆఫ్ సెంట్రల్ న్యూజెర్సీ తదితర సంస్థలు తమ పూర్తి మద్దతు, సహకారాన్ని అందించాయి. డాక్టర్స్ ఫార్మసీ ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది.  ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయుక్తమైన సదస్సును దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికీ నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని