జగన్‌ రెడ్డి పాలన చూసి విదేశాల్లో వెక్కిరిస్తున్నారు: రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి

ఏపీ సీఎం జగన్‌రెడ్డి పాలన చూసి విదేశాల్లో వెక్కిరిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

Published : 25 Nov 2022 00:41 IST

అమెరికా: ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పాలన చూసి విదేశాల్లో వెక్కిరిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ  ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని అమెరికాలో కూడా చేపట్టాలని  పిలుపునిచ్చారు.

  తెలుగువారంటే దేశంలోనే కాదు అమెరికాలో కూడా గౌరవం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి అత్యాశతో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్ అగమ్యగోచరంగా మారి ప్రపంచవ్యాప్తంగా పరువుపోవడం ఖర్మ కాక మరేమిటని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారు. రేపటి నుంచి ప్రైవేటు ఆస్తులను దోచుకుంటారని విమర్శించారు. ప్రవాసాంధ్రులు అప్రమత్తం కాకపోతే రాష్ట్రంలో ఇక ఏమీ మిగలందన్నారు. ఆదాయం లేకుండా చేసి ఆస్తులను తెగనమ్మేవాడు ముఖ్యమంత్రి కావడం ఇదేం ఖర్మ అని అన్నారు. 

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. జగన్ రెడ్డి సభలకు బలవంతంగా తీసుకువచ్చిన ప్రజలు ఊకదంపుడు ప్రసంగాలు వినలేక ఇదేం ఖర్మ అంటూ బారికేడ్లు దూకి పారిపోతున్నారు. రాబోయే ఎన్నికలు ప్రజల భవిష్యత్‌కు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలకమైన అంశం. తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మినహా మరోదారి లేదు. జగన్‌ రెడ్డి అధికారంలో కొనసాగినంత కాలం రాష్ట్రం బాగుపడే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదు. జగన్ రెడ్డి తన కల్తీ మద్యం వ్యాపారాన్ని ఏపీ నుంచి ఢిల్లీకి విస్తరింపజేశారన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కుటుంబ సమేతంగా ఇరుక్కుని తెలుగువారి పరువు తీయడం రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని అన్నారు.

సతీష్ వేమన మాట్లాడుతూ.. ప్రజలు తమకు తాత్కాలికంగా వచ్చే లబ్ధి గురించి ఆలోచించడం కంటే.. తమ బిడ్డల దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే పాలన చేతగాక ‘ఇదేం ఖర్మ’ రాష్ట్రానికి అని ప్రజలు విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

కార్యక్రమంలో భాను మాగులూరి, కిషోర్ కంచర్ల, యాష్ బద్దులూరి, రమేష్ అవిర్నేని తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని