సియాటెల్‌లో అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ శతజయంతి, మహానాడు ఉత్సవాలు

అమెరికాలోని సియాటెల్‌ నగరంలో ఎన్టీఆర్‌ శతజయంతి, తెదేపా మహానాడు ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఎన్నారై తెదేపా అమెరికా కోఆర్డినేటర్‌ జయరాం కోమటి ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. 

Updated : 27 Apr 2023 00:45 IST

సియాటెల్‌: ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో అమెరికాలోని సియాటెల్‌ నగరంలో ఎన్టీఆర్‌ శతజయంతి, తెదేపా మహానాడు ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్నారై తెదేపా అమెరికా కోఆర్డినేటర్‌ జయరాం కోమటి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 500 మంది తెలుగువారు పాల్గొని ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మంగళవాయిధ్యాల మధ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో నియంత పాలన నుంచి విముక్తి కల్పించి, భావితరాల భవిష్యత్తు కోసం తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను జయరాం కోమటి తెలియజేశారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. ఎన్టీఆర్ తెలుగువారి జాతి చైతన్య స్ఫూర్తి అని, అభ్యుదయానికి పాటుపడిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, తీసుకొచ్చిన రాజకీయ, పాలనా సంస్కరణలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులు గోపి కంచేటి ఎన్టీఆర్ డైలాగులు, పాటలు పాడి అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మంది కళాకారులు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. స్మిత డాన్స్ స్కూల్ చిన్నారులు విఘ్నేశ్వర ప్రార్థన నృత్యం, సతీష్ దర్భ చేసిన ఎన్టీఆర్ పాటల నృత్యకేళి, రవి దసిక చేసిన ఎన్టీఆర్ దానవీరశూరకర్ణలోని దుర్యోధన పాత్రాభినయం ఎంతో ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో మొదటగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండును తీర్మానించారు. తర్వాత సియాటెల్ ఎన్నారై తెదేపా కమిటీ సభ్యులు శ్రీనివాస్ అబ్బూరి, సంగీత దొంతినేని, జీవన్ నారా, రమేష్ చుండ్రు, రీనా రెడ్డి, హరిబాబు కామిశెట్టి, వేణు జోగుపర్తి, మనోజ్ లింగ, హేమంత్ మొవ్వ తదితరులు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టి, తెలుగుదేశం విధి విధానాలను కార్యక్రమానికి వచ్చిన వారికి తెలియజేశారు. అన్ని తీర్మానాలను అతిథులందరూ హర్షద్వానాల మధ్య ఏకగ్రీవంగా బలపరిచారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్స్, పార్టీ కార్యకర్తలకు ఎన్నారై తెదేపా సియాటెల్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి ధన్యవాదాలు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని