ఖతార్‌లో వేడుకగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

ఆంధ్ర కళావేదిక ఖతార్ ఆధ్వర్యంలో నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మే 5న దోహాలోని లా సిగాలే హోటల్‌లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి తారక రామారావు నట వారసుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు.

Updated : 10 May 2023 05:31 IST
ఖతార్‌: ఆంధ్ర కళావేదిక-ఖతార్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మే 5న దోహాలోని లా సిగాలే హోటల్‌లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి తారక రామారావు నట వారసుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన తండ్రి గురించి అద్భుతంగా ప్రసంగించడమే కాకుండా ‘శివశంకరీ శివానందలహరి’ పాటను పాడి ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నారు. ఆయన పాటకు ప్రేక్షకులందరూ ఫిదా అవడమే కాకుండా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. హర్షధ్వానాలతో ‘జై బాలయ్య’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆయన లైవ్‌లో పాడిన పాట వైరల్‌గా మారింది. 
ఈ సందర్భంగా బాలబాలికలు సంప్రదాయ నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రారంభించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయనీ గాయకులు సింహ భాగవతుల, ప్రవీణ్ కుమార్ కొప్పోలు, గాయని పర్ణిక మాన్య బాలకృష్ణ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనంతరం ఆంధ్ర కళావేదిక అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ.. కేవలం వారం రోజుల సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఖతార్ తెలుగు సంఘాలలో చరిత్ర సృష్టించిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు సహకరించిన గొట్టిపాటి రమణయ్య, తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ ప్రోత్సాహక కమిటీ సభ్యులు గోపాల్‌, వాసు, రమేష్, విక్రమ్ సుఖవాసి, స్వచ్ఛంద సేవకులుగా సహకరించిన గోవర్ధన్‌ అమూరుకు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు, వారి తల్లిదండ్రులకూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 
కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, వీబీకే మూర్తి, శ్రీ సుధ, శిరీష రామ్, రవీంద్ర, శేఖరం రావు, సాయి రమేష్, కేటీ రావు బృందం చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది.
కార్యక్రమంలో ఖతార్‌లోని భారత రాయబార సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అత్యున్నత సంస్థల (ICC, ISC ICBF, IBPN) అధ్యక్షులు, ప్రతినిధులు, ఖతార్‌లోని తెలుగు ప్రముఖులు, వివిధ తెలుగు సంఘాల (TKS, TPS, TGS, TJQ, TBA) అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఖతార్ నలుమూలల నుంచి 1200 మందికి పైగా హాజరయ్యారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని