NTR: ‘ఎన్టీఆర్‌ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు.. ఆయన కీర్తి అజరామరం’

అమెరికాలో ఎన్టీఆర్‌ వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్‌ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని.. ఆయన కీర్తి అజరామరమని గుంటూరు మిర్చి యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు అన్నారు. 

Published : 18 Jan 2023 17:19 IST

వాషింగ్టన్‌: ఎన్టీఆర్‌ 27వ వర్థంతి వేడుకలు అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్థంతి వేడుకల్లో పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కీర్తి అజరామరమని  గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. వాషింగ్టన్ డీసీ ఎన్నారై టీడీపీ విభాగం అధ్యక్షులు సుధీర్ కొమ్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మన్నవ మాట్లాడుతూ.. ‘‘బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్. సంక్షేమ రాజ్యాన్ని తీసుకువచ్చి, వినూత్న సేవాసంస్కృతిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మహనీయుడు. సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగి చరిత్ర సృష్టించారు. ఆయన చరిత్ర చెరిపేద్దామన్నా చెరిగిపోదు. పేరు తొలగించినా జనం గుండెల్లోంచి ఆయన రూపాన్ని చెరిపేయలేరు. తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగుజాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో నందమూరి చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది’’ అని నాటి పరిస్థితులను గుర్తుచేశారు. 

ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం తెలుగుజాతి గుండెల్లో జాతీయగీతంలా మారుమోగిందని సాయి బొల్లినేని అన్నారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాలని సూచించారు. అనంతరం కిషోర్ కంచెర్ల మాట్లాడుతూ.. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో ఓ ధ్రువతారగా వెలుగొందారని.. తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశ వ్యాప్తంగా ప్రజల హృదయాలను కొల్లగొట్టారన్నారు. రాముడు, కృష్ణుడంటే ఎన్టీఆర్ రూపమే గుర్తుకువస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ ఉప్పలపాటి, కార్తీక్ కోమటి, రమేష్ గుత్తా, నాగ దేవినేని, రమేష్ అవిరినేని, జనార్దన్ ఇరువూరి, యశ్వంత్ గుంటూరి, లక్ష్మణ్ కుమార్ భాష్యం, హరీష్ చౌదరి బెల్లం, కల్యాణ్ యేలూరి, పవన్ కుమార్ పొట్లూరి, నందీప్ పొడపాటి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని