TANA: ‘ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు’ సదస్సు విజయవంతం

తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ నాల్గవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ‘‘ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు’’ సదస్సు ఘనంగా జరిగింది.

Published : 24 May 2024 23:49 IST

టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ నాల్గవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ‘‘ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు’’ సదస్సు ఘనంగా జరిగింది. ప్రతి నెలా చివరి ఆదివారం అంతర్జాలం వేదిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డా.కె.పద్మరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు. తానా పూర్వధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా.నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ సాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సాహితీ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్. తోటకూర మాట్లాడుతూ ‘‘ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు సమస్యలుండేవి. ఆంధ్రప్రదేశ్‌లో ఆనాడు సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు ఎంతో ఉపయుక్తమయ్యాయి. ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం ఎక్కువగా ఉండేది. తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఓవైపు కమ్యూనిస్టులు పోరాటం సాగిస్తుంటే.. తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయి’’ అని అన్నారు.

విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా. గోరటి వెంకన్న, ప్రముఖ సినీగీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత డా. అందెశ్రీ, సినీగీత రచయిత మిట్టపల్లి సురేందర్, కళాభిమాని డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవి గొడిశాల జయరాజు, గద్దర్ కుమార్తె డా. వెన్నెల గద్దర్, అరుణోదయ కళాకారిణి బండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్ కుమారులు షేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం), డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ), పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం), దామోదర గణపతిరావు (జానపదగానం), చాట్రగడ్డ శ్రీనివాసుడు (డప్పువిన్యాసం) తదితరులు ఈ సదస్సులో పాల్గొని ఎన్నో ఉదాహరణలతో చేసిన ఆసక్తికర ప్రసంగాలు, కళావిన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని