NRI: ఠాగూర్ ‌మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరులో తానా స్రవంతి కార్యక్రమం సక్సెస్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ తరఫున తానా మీడియా కో ఆర్డినేటర్‌ ఠాగూర్‌ మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరులో నిర్వహించిన తానా స్రవంతి కార్యక్రమం విజయవంతమైంది. 

Published : 24 Dec 2022 22:13 IST

విజయవాడ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ తరఫున తానా మీడియా కో ఆర్డినేటర్‌ ఠాగూర్‌ మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరులో నిర్వహించిన తానా స్రవంతి కార్యక్రమం విజయవంతమైంది. జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు తానా ప్రతినిధులతో పాటు ఏరియా ప్రముఖులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేయూత కార్యక్రమం కింద పేద విద్యార్థులకు రూ.లక్ష విలువైన స్కాలర్‌ షిప్‌లు అందజేశారు. రైతు కోసం కార్యక్రమం కింద పేద రైతులకు పవర్‌ స్ప్రేయర్లు, రక్షణ పరికరాలు అందించారు. ఆదరణ కార్యక్రమం కింద మహిళలకు కుట్టుమిషన్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.

 

ఎన్నారై శ్రీనివాస నాదెళ్ల .. పెనమలూరు జెడ్పీ పాఠశాల పేద విద్యార్థికి రూ.10వేల ఆర్థికం సాయం చేశారు.తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ...కార్పొరేట్‌ స్కూల్‌ కంటే మిన్నగా హైస్కూల్‌ విద్యార్థులు పరిశుభ్రతకు పెద్ద పీట వేయడం సంతోషంగా ఉందన్నారు. తాను కూడా ఇలాంటి పాఠశాలలోనే చదువుకుని నేడు అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తున్నానని వివరించారు. ఈ ప్రాంతానికి చెందిన ఠాగూర్‌ మల్లినేని కూడా ఇక్కడే చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని, మీరు కూడా కష్టపడి చదివితే అభివృద్ధి చెందుతారని విద్యార్థులకు సూచించారు. పాఠశాల, పెనమలూరు అభివృద్ధికి తానా తరఫున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

తానా ఫౌండేషన్ ఛైర్మన్‌ వెంకటరమణ యార్లగడ్డ మాట్లాడుతూ... వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జెడ్పీ హైస్కూల్‌కు కావాల్సిన ఫర్నిచర్‌, ఇతర అవసరాలను తీర్చేందుకు తానా ఫౌండేషన్‌ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఠాగూర్‌ మల్లినేని మాట్లాడుతూ.. పెనమలూరు ప్రాంత అభివృద్ధికి, జెడ్పీ హైస్కూల్‌కు కావాల్సిన సౌకార్యాల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు. గ్రామస్థులు, విద్యార్థుల కోసం ఉచిత వైద్యశిబిరాలు, పేద విద్యార్థులు బాగా చదువుకునేందుకు వీలుగా స్కాలర్‌షిప్‌లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు తానా తరఫున అందజేసినట్టు చెప్పారు.  తానా సెక్రెటరీ సతీష్ వేమూరి, తానా చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ సునీల్‌ పాంత్రాతోపాటు, నాగా పంచుమర్తి, శ్రీనివాస్‌ ఓరుగంటి, జోగేశ్వరరావు పెద్దిబోయిన, శ్రీనివాస్‌ నాదెళ్ళ, పవన్‌ దొడ్డపనేని, అనిల్‌ వీరపనేని, గ్రామ సర్పంచ్‌ లింగాల భాస్కర్‌, పలువురు తానా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య విద్యార్థిని సాయి వర్దిని కిలారు బృందం , పెనమలూరుకు  చెందిన సుధీర్ పాలడుగు, వర ప్రసాద్  మరీదు, నరేంద్ర బాబు మోర్ల, ప్రవీణ్  కిలారు, కోడూరు మహేష్ , కృష్ణ  దావులూరి, సురేష్  కిలారు, సాంబశివరావు వీరంకి, తిరుమల గండరపు, గోపినాథ్ అర్చన, జావుల్లా రెహమాన్ షేక్ వాలంటీర్లుగా సేవలందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని