తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘అమ్మభాషా సేవలో అంధ మేధావుల’ సభ సక్సెస్‌

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమం ఈసారి ప్రత్యేకత సంతరించుకుంది. మాతృభాషా సేవలో అంధ మేధావులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు తమ జీవితంలో ఎదురైన అవరోధాలను పంచుకున్నారు.

Published : 27 Feb 2023 22:40 IST

డాలస్‌, టెక్సాస్‌ (అమెరికా): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఫిబ్రవరి 26న నిర్వహించిన 45వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం “జ్ఞాననేత్రులు - తెలుగుదివ్వెలు” మాతృ భాషాసేవలో అంధ మేధావులు అనే సాహిత్య కార్యక్రమం విజయవంతంగా జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరుకూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారిందరిలో ఉన్న సారూప్యం దృష్టి లోపం కాదు, దూరదృష్టి అన్నారు. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో లేదనుకుంటూ తమ జీవితాలను అంధకారంలోకి నెట్టుకొంటున్న అసంతృప్తివాదులకు వీరి జీవితాలు వెలుగుబాటలు కావాలన్నారు. తమ శక్తిని తాము తెలుసుకోలేక జీవితంలో ఇంకా ఏమీ చేయలేమని కృంగిపోతున్న నిరాశావాదులకు ఈ అతిథుల జీవితాలు స్ఫూర్తి పతాకలుగా పేర్కొన్నారు. కేవలం కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం అనే లక్షణాలను ఆయుధాలుగా చేసుకుని జీవన పోరాటం చేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న ఈ ధీరోదాత్తుల జీవితాలు అందరికీ కనువిప్పు అంటూ స్వాగతం పలికారు.

ఈ అంతర్జాల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. మల్లిఖార్జున రావు మాట్లాడుతూ..  ప్రతి నెలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషా సాహిత్య సేవలో నిమగ్నమైన తానా ప్రపంచ సాహిత్యవేదికకు అభినందనలు తెలిపారు. అంధ మేధావులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనందని ప్రశంసించారు. విశిష్ట అతిథులుగా ఆచార్య మన్నవ సత్యనారాయణ, పూర్వ తెలుగు శాఖాధ్యక్షులు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (దుగ్గిరాల); ఆచార్య జక్కంపూడి మునిరత్నం నాయుడు, విశ్రాంత తెలుగు ఆచార్యులు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి); డా. బొల్లా జ్యోత్స్న ఫణిజ, సహాయఆచార్యులు, ఆంగ్ల భాషా విభాగం, దిల్లీ విశ్వవిద్యాలయం (న్యూదిల్లీ); డి.వి మోహన కృష్ణ, శాస్త్రీయ సంగీత విద్వాంసులు (హైదరాబాద్), షాకీర్ మొహమ్మద్, అపార జ్ఞాపకశక్తి సంపన్నులు, వ్యక్తిత్వ వికాస శిక్షకులు (హైదరాబాద్); సత్యవాడ సోదరీమణులు -  సత్యవాడ రఘునాథమ్మ, సత్యవాడ సూర్యకుమారి, రచయిత్రులు, గాయనిలు (విశాఖపట్నం); డా. బెంకి రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యాయుడు (జడ్చర్ల); డా. చిక్కా హరీష్ కుమార్, రచయిత (మహబూబ్ నగర్); డా. చిన్నావుల వేంకట రాజారెడ్డి, ఉపాధ్యాయుడు (కర్నూలు);  మోపూరు పెంచల నరసింహం, కవి (నెల్లూరు), పెండ్యాల గాయత్రి, ఉపాధ్యాయిని (సింగరాయకొండ); టింగిరికార్ వెంకటేశ్, వ్యాఖ్యాత, రచయిత (మహబూబ్ నగర్) పాల్గొని తెలుగు భాషపట్ల తమకున్న అపారమైన అభిమానాన్ని, వారు రచించిన కథా, కవితా సంపుటాలు, నవలల గురించి పంచుకున్నారు. వారి జీవితంలో ఎదురైన అవరోధాలను ఎదుర్కుంటున్న తీరు, తెలుగు భాషను పరిరక్షించి, పరివ్యాప్తం చేయడంలో తల్లిదండ్రులుగా, వ్యక్తులుగా, సంస్థలుగా, ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరి భాద్యతను గుర్తుచేసి అందరికీ కనువిప్పు కలిగించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ తన ముగింపు సందేశంలో ఈ నాటి సాహిత్యకార్యక్రమం మనిషి తలుచుకుంటే జీవితంలో సాధించ లేనిది ఏదీ లేదు అనే నానుడికి ఈ విశిష్ట అతిథుల జీవితాలే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని