ఖతార్‌లో ఘనంగా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు

ఖతార్‌లో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను తెదేపా నాయకులు, ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మళ్లీ ఏపీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఆకాంక్షించారు. 

Updated : 24 Apr 2023 01:08 IST

ఖతార్‌: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఖతార్‌లో తెలుగుదేశం (ఖతార్‌ విభాగం) ఆధ్వర్యంలో ప్రవాస ఆంధ్రులు ఘనంగా నిర్వహించారు. పెద్దఎత్తున తెలుగుదేశం కుటుంబసభ్యులు హాజరై కేకు కోసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఖతార్‌ తెదేపా ప్రవాసాంధ్ర అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ.. జగన్ అరాచక పాలనను అంతమొందించి ఎలాగైనా చంద్రబాబును మరోసారి అధికారంలోకి తీసుకొనివచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడపాలన్నారు. 

ప్రధాన కార్యదర్శి పొనుగుమాటి రవి మాట్లాడుతూ.. విభజన గాయాలు, లోటు బడ్జెట్‌తో చంద్రబాబు అధికారం చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకొని వెళుతున్న తరుణంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిందన్నారు. భావిపౌరుల బంగారు భవిషత్తును నిర్వీర్యం చేసేలా సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యక్షులు మద్దిపోటి నరేష్ మాట్లాడుతూ.. ప్రవాసాంధ్రులు అందరూ పెద్దఎత్తున పార్టీకి సహాయ సహకారాలు అందించాలని, అధినాయకుని ఆదేశాల మేరకు పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకునిరావాలని కోరారు.

గల్ఫ్ సంఘం ఖతార్ కార్యవర్గ సభ్యుడు మలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన  ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుసరించిన వ్యూహాలు సత్ఫలితాలు ఇచ్చాయని, రాబోయే ఎన్నికలలో కూడా ఇటువంటి వ్యూహాలనే అనుసరించి విజయం సాధించి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలన్నారు. 

కోశాధికారి విక్రమ్ సుఖవాసి, సామాజిక ప్రసార మాధ్యమం సమన్వయకర్త గోవర్ధనరెడ్డి, ఈ కార్యక్రమ సమన్వయకర్త  దాసరి రమేష్, దండా విజయభాస్కర్ మాట్లాడారు. తెదేపాను తిరిగి అధికారంలోనికి తీసుకొని వచ్చి తెలుగువారి ఆత్మగౌరన్ని కాపాడాలని కోరారు. ఇప్పటికే ప్రజలందరూ తెదేపా వైపు చూస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని మనమందరూ ఉపయోగించుకొని ప్రజలందరినీ పార్టీవైపు తీసుకురావడానికి తగిన వ్యూహాలు రచించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ముస్లిం సోదరులు పాల్గొని అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని