అట్లాంటాలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన తెలంగాణ ఐటీ మంత్రి

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి అమెరికా అట్లాంటాలోని గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Published : 06 Jun 2024 14:49 IST

అట్లాంటా: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అట్లాంటాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యూఎస్‌ఏ (GFUSA) ఆహ్వానం మేరకు అట్లాంటా వెళ్లిన ఆయన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ సెంటర్‌లోని గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఫ్రీడమ్ హాల్, గాంధీ రూమ్, కింగ్ రూమ్, ఎటర్నల్ ఫ్లేమ్, ప్రసిద్ధ ఎబినేజర్ బాప్టిస్ట్ చర్చి, కింగ్స్ బర్త్ హోమ్, విజిటర్స్ సెంటర్, కింగ్ క్రిప్ట్‌లను సందర్శించారు.

అట్లాంటాలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు సాకారం చేసినందుకు ఇండియన్ ఎంబసీ, ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, వివిధ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్‌తో పాటు నేషనల్ పార్క్ సర్వీస్‌కు శ్రీధర్‌ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ స్మారక చిహ్నం ఏటా కింగ్ పార్క్‌ను సందర్శించే లక్షలాది మంది పర్యాటకులకు అహింస, శాంతి కోసం పోరాడాలనే విషయం గుర్తుకుతెస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్‌, జీఎఫ్‌యూఎస్‌ఏ మీడియా డైరెక్టర్‌ రవి పోణంగి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆంటోనీ థాలియాత్, ఛైర్మన్‌ సుభాష్ రజ్దాన్‌ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలోని గాంధీ ఫౌండేషన్ (GFUSA)ను 1997 అక్టోబర్ 26న స్థాపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని