ప్రవాసాంధ్రులు కళ్లు తెరవకపోతే అక్కడ మీ ఆస్తులకు రక్షణ కరవే.. మన్నవ

ఏపీలో ప్రస్తుతం ఉన్న పాలక పక్షం గద్దె దిగితేనే ప్రవాసాంధ్రుల ఆస్తులకు రక్షణ ఉంటుందని ముప్పాళ్ల నాగేశ్వరరావు, మన్నవ సుబ్బారావు అన్నారు. ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సమావేశం వాషింగ్టన్ డీసీలో భాను ప్రకాష్ మాగులూరి అధ్యక్షతన జరిగింది.

Published : 02 Aug 2023 18:53 IST

వాషింగ్టన్‌ డీసీ: ఏపీలో ప్రస్తుతం ఉన్న పాలక పక్షం గద్దె దిగితేనే ప్రవాసాంధ్రుల ఆస్తులకు రక్షణ ఉంటుందని మన్నవ సుబ్బారావు అన్నారు. ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సమావేశం వాషింగ్టన్ డీసీలో భాను ప్రకాష్ మాగులూరి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, మైనేని రాంప్రసాద్, తానా వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి, కొమ్మి సుబ్బయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ప్రగతి కుంటు పడింది. రాజధాని లేని రాష్ట్రంగా, అభివృద్ధి ఆనవాళ్లు లేని దిశగా సాగుతోంది. దానికి అనుగుణంగా ప్రవాసాంధ్రులు తమ వంతు సహాయ సహకారాలు మాతృభూమికి అందించాలి. గత నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో పలు రంగాలు కుదేలయ్యాయి. సంక్షేమ పథకాల పేరిట జరుగుతున్న పాలన పూర్తిగా అసమంజసం. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి’’ అన్నారు.  అనంతరం మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. సమర్థ నాయకత్వ లేమి, అవివేక, కక్షపూరిత నిర్ణయాలతో రాష్ట్రం పూర్తిగా అప్పులపాలైంది. నాలుగేళ్లలో రూ.11.30 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ భారం ప్రజలపై పడింది. ప్రవాసాంధ్రులు కళ్లు తెరవకపోతే అక్కడ మీ ఆస్తులకు, ఆప్తులకు కూడా రక్షణ ఉండదు. ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరం కలవడం సంతోషంగా ఉంది’’ అన్నారు.  కొత్తగా ఎన్నికైన తానా నూతన ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నరేన్ కొడాలిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఏ దేశమేగినా ఏ రంగంలో అడుగుపెట్టినా తెలుగువారు, భారతీయులంతా కష్టపడేతత్వంతో ముందుకెళ్తున్నారని తానా నూతన వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి అన్నారు. కొత్త ప్రమాణాలతో తన కార్యాచరణ ఇక ముందు సాగుతుందని తెలిపారు. అనంతరం భాను మాగులూరి మాట్లాడుతూ.. మాతృభాష, మాతృభూమిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. అందుకోసం  ప్రవాసాంధ్రులంతా తమవంతు పాత్రను, కర్తవ్యాన్ని నిర్వహించాలన్నారు. శక్తి మేరకు విద్యా రంగంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు చేయూతనందించాలని, తెలుగు వారందరూ ప్రపంచ వేదికపై తమ మేధో శక్తితో సత్తా చాటుతూ, వివిధ రంగాల్లో నూతన ఒరవడి సృష్టిస్తూ, ప్రగతి బాటలో దూసుకెళ్ళడం అందరికీ గర్వకారణమన్నారు.  మైనేని రాంప్రసాద్ మాట్లాడుతూ.. ‘రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. అమరావతి రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే దేశంలోనే ముందు వరుసలో ఉండేది’ అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముపాళ్ల నాగేశ్వరరావు, మన్నవ సుబ్బారావు, నరేన్ కొడాలిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుధీర్ కొమ్మి, రామ్ చౌదరి ఉప్పుటూరి, కిషోర్ కంచర్ల, ఆకాశ్‌ వలేటి, రవి ఐతా, యండమూరి నాగేశ్వరరావు, పాకాలపాటి కృష్ణయ్య, బండ మల్లారెడ్డి, రమేష్ అవిరినేని, సీతారామారావు, ప్రసాద్ పారుపల్లితో పాటు పలువురు ప్రవాసాంధ్రులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని