కళామతల్లి ముద్దు బిడ్డలను సన్మానించడం అభినందనీయం : వెంకయ్యనాయుడు

ఖండాంతరాలు దాటి వెళ్లినా జన్మభూమి రుణం తీర్చుకుంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం సేవలు అభినందనీయమని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తానా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శుక్రవారం నిర్వహించిన ‘తానా కళారాధన’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు

Published : 17 Dec 2022 22:42 IST

హైదరాబాద్‌: ఖండాంతరాలు దాటి వెళ్లినా జన్మభూమి రుణం తీర్చుకుంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సేవలు అభినందనీయమని  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తానా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శుక్రవారం నిర్వహించిన ‘తానా కళారాధన’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు సినీ రంగంలో విశేష కృషి చేసిన వారిని ఘనంగా సన్మానించారు.

అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..మాతృ మూర్తిని, మాతృ భాషను, ఉన్న ఊరిని, గురువులను ఎప్పటికీ మరవకూడదని అన్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలోనూ తెలుగు వెలుగుతోందని, మాతృభాష అభివృద్ధి కోసం ప్రవాసులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. ఇక్కడున్న తెలుగువారు అక్కడి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ‘ముందు మన భాషను నేర్చుకోవాలి, ఆ తరువాతే ఆంగ్లం నేర్చుకోవాలి’ అని చెబుతూ, పిల్లలు మాతృభాషలో మాట్లాడేలా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని కోరారు. ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు గానీ, అమ్మభాషను మరిచిపోరాదని, మాతృభాషలో చదవడం వల్ల ఉన్నత పదవులు రావన్న భావన వద్దని చెప్పారు. ప్రస్తుత రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ మాతృభాషలోనే చదువుకొని ఉన్నత పదవులను చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తానూ కూడా పల్లెటూరులో మాతృభాషలో చదువుకున్నానని చెప్పారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. అమెరికా సంయుక్త రాష్ట్రాలనుంచి ఇక్కడకు వచ్చి తెలుగు భాష మీద ప్రేమతో తెలుగు వారి మీద అభిమానంతో, ఈ కార్యక్రమాలను ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న ‘తానా’ వారిని అభినందించారు. T A N A అంటే తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా అనే కాదు 'తెలుగువారు అందరూ నా వారే' కూడా అని అన్నారు. మురళి మోహన్ మాట్లాడుతూ.. ‘‘ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని ఉన్నత ఉద్యోగాల కోసం సప్త సముద్రాలు దాటి అక్కడ ఉన్నత ఉద్యోగాలు చేస్తూ, మనం గర్వపడేలా అక్కడ నివసిస్తున్న మన తెలుగు వారందరికీ అభినందనలు. ఇక్కడ మన కళలను మరచి పోయాము కానీ అమెరికాలో ప్రతీ ఏడాది ఒక పండగలాగా ఇక్కడ నుంచి కళాకారులను ఆహ్వానించి మన కళలను ఆదరిస్తున్న తానా వారు ఇక్కడకు వచ్చి మమ్మలి సన్మానించడం తెలుగు వారి పట్ల వారికున్న అభిమానం ఎంతటిదో అర్థమౌతుంది.’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అలనాటి సినీ నటి కృష్ణవేణి, నటులు కోట శ్రీనివాసరావు, మురళీమోహన్‌, గిరిబాబు, గాయని సుశీల, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు కోదండరామిరెడ్డి, గాయని శోభారాజు, సంగీత గురువు రామాచారి, సినీనటుడు బ్రహ్మానందం, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులను సన్మానించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ  ఆకట్టుకున్నాయి. గురు రామాచారి ఆధ్వర్యంలో వారి శిష్యులు దాదాపు 80 మంది చేసిన గణేశ వందనంతో కార్యక్రమాలను ప్రారంభించారు. సౌందర్య కౌశిక్‌ చేసిన నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. రమాదేవి శిష్యులు చేసిన నృత్య ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. దాదాపు 85 మందికిపైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతి అట్లూరి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో సహకరించి విజయవంతం చేశారు.  స్కందన్షి  గ్రూప్‌నకు చెందిన సురేష్‌ రెడ్డి దంపతులను కూడా తానా నాయకులు శాలువా, మెమెంటోలతో సన్మానించారు.  తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కమిటీ కన్వీనర్‌ రవి పొట్లూరి, తానా చైతన్య స్రవంతి కో ఆర్డినేటర్‌ సునీల్‌ పంత్ర, ఫౌండేషన్‌ కార్యదర్శి శశికాంత్‌ వల్లేపల్లి తదితరులు మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు