YS Sharmila: ఎన్టీఆర్‌ను అవమానిస్తే కోట్ల మందిని అవమానించినట్లే..

‘‘ఒక సంస్థకు ఒక ప్రభుత్వం ఒక పెద్ద మనిషి పేరు పెట్టాక దాన్ని కాదని మరొక ప్రభుత్వం ఆ పేరు తొలగిస్తే ఆయనను అవమానించినట్లే అవుతుంది. అంతేకాదు.. ఆయనను అభిమానించే (ఎన్టీఆర్‌) కోట్ల మంది ప్రజలను

Updated : 24 Sep 2022 12:07 IST

ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం పేరు మార్పుపై వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలు

మోమిన్‌పేట, న్యూస్‌టుడే: ‘‘ఒక సంస్థకు ఒక ప్రభుత్వం ఒక పెద్ద మనిషి పేరు పెట్టాక దాన్ని కాదని మరొక ప్రభుత్వం ఆ పేరు తొలగిస్తే ఆయనను అవమానించినట్లే అవుతుంది. అంతేకాదు.. ఆయనను అభిమానించే (ఎన్టీఆర్‌) కోట్ల మంది ప్రజలను అవమానించినట్లే’’ అని ఏపీలోని ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఉద్దేశించి వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. ఇలా సంస్థల పేర్లను తొలగించడం సరైన చర్య కాదన్నారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం మొరంగపల్లి సమీపంలో పాదయాత్రలో ఒక మీడియా ఛానెల్‌తో ఆమె మాట్లాడారు. ‘మా నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు. ఆయనను నేను ఆరాధించినట్లు ఎవరూ ఆరాధించలేరు. సంస్థల పేర్ల మార్పిడి విషయానికొస్తే... ఆ సంస్థకు ఈ రోజు వైఎస్సార్‌ పేరు పెట్టారు. రేపు వచ్చే ప్రభుత్వం ఆ పేరు తొలగించి మరొక పేరు పెడితే వైఎస్సార్‌కు అవమానం కలిగినట్లు కాదా. అసలు ఒకరి ఖ్యాతిని తీసుకుని వైఎస్సార్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకున్న పేరు చరిత్రలో మరెవరికీ లేదు. ఆయన చనిపోతే ఆ బాధ తట్టుకోలేక 700 మంది గుండెలు ఆగిపోయాయి’ అని పేర్కొన్నారు.

గల్లీకో బారు.. ఇదేనా తీరు!

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గల్లీకో బారు ఏర్పాటు చేసి మద్యానికి నిలయంగా మార్చారని షర్మిల విమర్శించారు. మోమిన్‌పేట పాత బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో ఆమె మాట్లాడారు. ‘‘పంచాయతీలకు నిధులు లేవని ప్రజాప్రతినిధులు అడిగితే.. ఓ మంత్రి మద్యం సీసాలు అమ్ముకొని నిధులు సమాకూర్చుకోవాలని అనడం ఎంతవరకు సమంజసం? ఆధారాలతో మాట్లాడుతుంటే ఎమ్మెల్యేలు నాపై సభాపతికి ఫిర్యాదు చేశారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ ప్రకటన విడుదల చేశారు. ప్రివిలేజ్‌ కమిటీ ముందుకు రావాల్సి వస్తుందంటున్నారు. నేను ఎక్కడికైనా వస్తా.. ప్రశ్నిస్తా.’’ అని షర్మిల అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని