నెహ్రూ నిర్మించిన వ్యవస్థలపై బుల్డోజర్లు
దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిర్మించిన వ్యవస్థలపై గత ఎనిమిదేళ్లుగా బుల్డోజర్లు నడుస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. భాజపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెహ్రూ వర్ధంతి రోజున శుక్రవారం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన రాహుల్...
భాజపాపై రాహుల్ గాంధీ ధ్వజం
దేశ ప్రథమ ప్రధాని వర్ధంతి సందర్భంగా ఘనంగా జాతి నివాళి
దిల్లీ: దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిర్మించిన వ్యవస్థలపై గత ఎనిమిదేళ్లుగా బుల్డోజర్లు నడుస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. భాజపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెహ్రూ వర్ధంతి రోజున శుక్రవారం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన రాహుల్... కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘ఐఐటీ, ఐఐఎం, ఎల్ఐసీ, బెల్, ఎన్ఐడీ, బార్క్, ఎయిమ్స్, ఇస్రో, సెయిల్, ఓఎన్జీసీ, డీఆర్డీవో తదితర సంస్థలను నెలకొల్పి దేశంలో వ్యవస్థలను, తద్వారా ప్రజాసామ్య మూలాలను నెహ్రూ బలోపేతం చేశారు. 8 ఏళ్లలో వాటిపై భాజపా బుల్డోజర్లు నడిపి ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసింది’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ప్రస్తుత సమయంలో భారత్ను కలపడం (భారత్ జోడో) అత్యవసరం అని వ్యాఖ్యానించారు. మరో ట్వీట్లో.. వివిధ ప్రపంచాధినేతలతో నెహ్రూ దిగిన ఫొటోలను రాహుల్ గాంధీ పంచుకున్నారు. ‘‘నెహ్రూ చనిపోయి 58 ఏళ్లు గడచిపోయాయి. ఆయన ఆలోచనలు, రాజకీయాలు, దార్శనికత.. నేటికీ అనుసరణీయమే. ఈ దేశ అమరపుత్రుడి విలువలు.. ఎప్పటికీ మన చర్యలను, మనస్సాక్షిని మార్గనిర్దేశం చేస్తాయి’’ అని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీనియర్ కాంగ్రెస్ నేతలు నెహ్రూకి ఘనంగా నివాళులు అర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.