IND Vs SA : ఆ ఒక్కటి పట్టేస్తే..

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగానే జట్టుపై ఎన్నో విమర్శలు, కుర్రాళ్ల సత్తాపై ఎన్నో సందేహాలు! సిరీస్‌ గెలవడం సంగతటుంచి వైట్‌ వాష్‌ తప్పించుకుంటారా అంటూ వ్యంగ్యాస్త్రాలు! అన్నింటినీ తట్టుకుని నిలబడ్డ యువ జట్టు.. విశాఖలో అదిరే ప్రదర్శనతో బోణీ కొట్టింది.

Updated : 19 Jun 2022 06:58 IST

జోరు మీద టీమ్‌ఇండియా 

నేడే దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక పోరు

రాత్రి 7 నుంచి చివరి టీ20

బెంగళూరు

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగానే జట్టుపై ఎన్నో విమర్శలు, కుర్రాళ్ల సత్తాపై ఎన్నో సందేహాలు! సిరీస్‌ గెలవడం సంగతటుంచి వైట్‌ వాష్‌ తప్పించుకుంటారా అంటూ వ్యంగ్యాస్త్రాలు! అన్నింటినీ తట్టుకుని నిలబడ్డ యువ జట్టు.. విశాఖలో అదిరే ప్రదర్శనతో బోణీ కొట్టింది. రాజ్‌కోట్‌లో ఇంకా మెరుగైన ఆటతో సిరీస్‌ను సమం చేసింది. వరుసగా రెండు విజయాలు సాధించిన ఉత్సాహంలో ఇప్పుడు సిరీస్‌ నిర్ణయాత్మక పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. నాలుగో టీ20లో మరీ చిత్తుగా ఓడడంతో డీలా పడ్డప్పటికీ.. ప్రతిభావంతులతో నిండిన దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం గట్టిగా పోరాడుతుందనడంలో సందేహం లేదు.

కోహ్లి, రోహిత్‌, రాహుల్‌, బుమ్రా, షమి లాంటి సీనియర్లు లేకుండా.. ఎక్కువగా యువ ఆటగాళ్లతో నిండిన జట్టుతో బరిలోకి దిగి.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎదురు దెబ్బల తర్వాత గొప్పగా పుంజుకుని సిరీస్‌ను సమం చేసిన టీమ్‌ఇండియా.. అదే ఊపును కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్ణయాత్మక అయిదో టీ20 జరగబోతోంది. ఒక్క మ్యాచ్‌ ఓడినా సిరీస్‌ చేజారే స్థితిలో దృఢంగా నిలబడి వరుసగా రెండు ఘన విజయాలు సాధించడం యువ భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచేదే. నాలుగో టీ20లో మరీ 87 పరుగులకే కుప్పకూలడం, 82 పరుగుల తేడాతో ఓడడం సఫారీ జట్టుకు మింగుడు పడని విషయమే. ఉదాసీనతకు తావివ్వకుండా సమష్టిగా చెలరేగితే యువ భారత్‌ సిరీస్‌ గెలవడం తేలికే.

టాప్‌ కూడా తోడైతే..: భారత్‌ సిరీస్‌లో పుంజుకోవడానికి ప్రధాన కారణం మిడిలార్డర్‌. ముఖ్యంగా హార్దిక్‌ పాండ్య ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ మెరుపులు మెరిపిస్తున్నాడు. గత మ్యాచ్‌లో దినేశ్‌ కార్తీక్‌ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరి నుంచి ఇదే జోరును జట్టు కోరుకుంటోంది. అయితే టాప్‌ఆర్డర్లో నిలకడ లేమి భారత్‌ను కలవరపెడుతోంది. ఇషాన్‌ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. అతను కూడా గత మ్యాచ్‌లో కొంచెం తడబడ్డాడు. రుతురాజ్‌ మూడో టీ20లో మినహా విఫలమయ్యాడు. శ్రేయస్‌ అయ్యర్‌ పర్వాలేదనిపించాడు కానీ.. అతడి నుంచి జట్టు కోరుకునే పెద్ద ఇన్నింగ్స్‌ ఆడట్లేదు. ఇక అందరికంటే పంత్‌ వైఫల్యం జట్టును ఎక్కువ ఇబ్బంది పెడుతోంది. కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సిన అతను.. నిర్లక్ష్యపు షాట్లు ఆడి వెనుదిరుగుతున్నాడు. ఆదివారం వీరంతా నిలకడగా ఆడి జట్టు భారీ స్కోరు సాధించడానికి తోడ్పడాలి. తొలి మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన తర్వాత.. బౌలర్లు గొప్పగా పుంజుకుని చక్కటి ప్రదర్శన చేస్తుండడం శుభ పరిణామం. భువనేశ్వర్‌ పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఆరంభంలోనే కట్టడి చేస్తున్నాడు. హర్షల్‌ పటేల్‌ ప్రతి మ్యాచ్‌లోనూ కీలక వికెట్లు తీస్తున్నాడు. చాహల్‌ మధ్య ఓవర్లలో అదరగొడుతున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో తేలిపోయిన అవేష్‌ ఖాన్‌.. నాలుగో టీ20లో నాలుగు వికెట్లు తీసి లెక్క సరి చేశాడు. అక్షర్‌ ఒక్కడే ఇప్పటిదాకా సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపించలేదు.

బవుమా ఆడతాడా?: తొలి మ్యాచ్‌లో 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించి, రెండో టీ20లోనూ సులువుగా నెగ్గిన దక్షిణాఫ్రికా.. సిరీస్‌లో ఇప్పుడు ఈ స్థితిలో ఉంటుందని ఊహించి ఉండదు. నాలుగో టీ20లో మరీ 87 పరుగులకే కుప్పకూలడం ఆ జట్టును పెద్ద షాకే. ఈ మ్యాచ్‌లో గాయపడి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగి మళ్లీ బ్యాటింగ్‌కు రాని కెప్టెన్‌ బవుమా.. ఆదివారం బరిలోకి దిగడంపై స్పష్టత లేదు. అతను అందుబాటులో లేకుంటే ఫామ్‌లో లేని రీజా హెండ్రిక్స్‌నే డికాక్‌కు జోడీగా బరిలోకి దించుతారు. కేశవ్‌ మహరాజ్‌ జట్టు పగ్గాలందుకుంటాడు. కేశవ్‌తో పాటు షంసి రూపంలో నాణ్యమైన స్పిన్నర్లున్నప్పటికీ.. స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లను దక్షిణాఫ్రికా పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది. పేసర్లు పర్వాలేదు. గత మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయిన రబాడ.. చివరి టీ20లో ఆడనున్నాడు. చిన్నస్వామి స్టేడియం స్పిన్‌కు అనుకూలమని షంసిని దక్షిణాఫ్రికా కొనసాగిస్తుందా లేక అతడిపై వేటు వేసి ఎంగిడి, జాన్సన్‌లిద్దరినీ దక్షిణాఫ్రికా తుది జట్టులో ఆడిస్తుందా అన్నది చూడాలి. బ్యాటింగ్‌లో డికాక్‌, వాండర్‌డసెన్‌, మిల్లర్‌ల మీద సఫారీ జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది.

తుది జట్లు (అంచనా)... భారత్‌: రుతురాజ్‌, ఇషాన్‌, శ్రేయస్‌, పంత్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, అవేష్‌, చాహల్‌.

దక్షిణాఫ్రికా: డికాక్‌ (వికెట్‌ కీపర్‌), బవుమా (కెప్టెన్‌)/రీజా హెండ్రిక్స్‌, ప్రిటోరియస్‌, వాండర్‌డసెన్‌, క్లాసెన్‌, మిల్లర్‌, జాన్సన్‌/షంసి, నోకియా, రబాడ, కేశవ్‌ మహరాజ్‌, ఎంగిడి.


3.55

ఈ సిరీస్‌లో భువనేశ్వర్‌ పవర్‌ప్లే ఎకానమీ. తొలి 6 ఓవర్లలో అతను 54 బంతులేసి 32 పరుగులే ఇచ్చాడు. 4 వికెట్లు పడగొట్టాడు.


చిన్నస్వామి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఒక టీ20 ఆడింది. 2019లో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

వరుణుడు కరుణిస్తేనే..

టీ20 సిరీస్‌ నిర్ణయాత్మక పోరు సజావుగా జరగడం సందేహంగానే ఉంది. రుతుపవనాల తాకిడితో దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతుండగా.. బెంగళూరునూ వరుణుడు వదలట్లేదు. ఆదివారం మ్యాచ్‌కు వర్షం ముప్పున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పూర్తిగా మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోదు కానీ.. ఆటకు వర్షం అంతరాయం మాత్రం ఉంటుందంటున్నారు.

పిచ్‌.. సమతూకంగా

చిన్నస్వామి స్టేడియం పిచ్‌ బ్యాట్స్‌మెన్‌, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. ఇక్కడి పిచ్‌, చిన్న బౌండరీలు బ్యాట్స్‌మెన్‌కు కలిసొచ్చేవే. అయితే ఈ మైదానంలో మరీ భారీ స్కోర్లు నమోదు కావు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 155. స్పిన్నర్లకు పిచ్‌ బాగా అనుకూలిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని