మొబైల్‌ @ 50

ఎవరి చేతిలో చూసినా ఫోనే. ఎవరి జేబులో చూసినా ఫోనే. సరుకులు కొనాలన్నా, డబ్బులు కట్టాలన్నా.. ఫోన్‌తోనే. ఫొటో తీయాలన్నా, వీడియో తీయాలన్నా దీంతోనే.

Published : 05 Apr 2023 00:38 IST

తొలి మొబైల్‌ ఫోన్‌తో మార్టిన్‌ కూపర్‌

ఎవరి చేతిలో చూసినా ఫోనే. ఎవరి జేబులో చూసినా ఫోనే. సరుకులు కొనాలన్నా, డబ్బులు కట్టాలన్నా.. ఫోన్‌తోనే. ఫొటో తీయాలన్నా, వీడియో తీయాలన్నా దీంతోనే. రేడియో, టీవీ వంటి వాటినీ పక్కకు నెట్టేసి ఇదే సమస్త వినోద సాధనంగా మారిపోయింది. బుడిబుడి అడుగులేసే చిన్నారుల దగ్గరి నుంచి పండు ముదుసలి వరకూ అంతా దీనికి దాసులే! ఇదంతా ఇప్పుడెండుకు అనుకుంటున్నారా? మొబైల్‌ ఫోన్‌ ఇటీవలే 50ల్లోకి అడుగెట్టింది మరి. టెలిఫోన్‌ మాటలను ఇంటి గడపను దాటించి.. ఎక్కడికంటే అక్కడికి మోసుకెళ్లటంతోనే ఆగకుండా జన జీవన స్రవంతిలో ప్రధాన భాగంగా మారిన దీని కథేంటో చూద్దామా.

సమాచార రంగంలో టెలిఫోన్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సుదూరంలో ఉన్నవారిని అప్పటికప్పుడు మాటలతో అనుసంధానం చేసిన తీరే అద్భుతమనుకుంటే.. మొబైల్‌ ఫోన్‌ అంతకన్నా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. మారుమూల ప్రాంతాలకు వెళ్లినా మాటల వారధిగా మారిపోయింది. అక్కడితోనే ఆగకుండా నిత్య జీవనంలో వాడే పరికాలనూ ఇముడ్చుకుంటూ రోజురోజుకీ విస్తరిస్తోంది. ఇంటర్నెట్‌ రాకతో మరింత విజృంభించింది. యాప్‌ల అనుసంధానంతో రాకెట్‌ వేగంతో దూసుకుపోతోంది. ఇంతకీ మొట్టమొదటి మొబైల్‌ ఫోన్‌ను తయారుచేసింది ఎవరో తెలుసా? అమెరికా ఇంజినీర్‌ మార్టిన్‌ కూపర్‌. మొట్టమొదటి మొబైల్‌ కాల్‌ను చేసిందీ ఆయనే. అందుకే మార్టిన్‌ను ‘సెల్‌ఫోన్‌ పితామహుడు’ అని పిలుస్తారు.

జపాన్‌లో 3జీ

జపాన్‌ 2001లో తొలిసారిగా 3జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ను వాడుకుంది. ఇది అత్యధిక వేగంతో ఇంటర్నెట్‌ వాడకానికి తలుపులు తెరచింది.

* 2009లోనే అత్యధిక వేగంతో కూడిన 4జీ శకం మొదలైంది. దీన్ని వాడుకున్న తొలి నగరంగా స్టాక్‌హోం చరిత్రకు ఎక్కింది.

* మరింత వేగంగా ఇంటర్నెట్‌ వాడుకోవటానికి తోడ్పడే 5జీ యుగం 2019లో మొదలైంది. దీన్ని ఆరంభించిన తొలి దేశం దక్షిణ కొరియా.

ఆద్యంతం ఆసక్తికరం

మొబైల్‌ ఫోన్‌ తయారీ కథ ఆది నుంచీ ఆసక్తి కరమే. అమెరికాలోని ప్రముఖ టెలికం సంస్థ బెల్స్‌ సిస్టమ్‌ సెల్యులర్‌ ఫోన్‌ వ్యవస్థ భావనను ప్రతిపాదించింది. దీన్ని రూపొందించే పనిలో పడింది. నాసా అపోలో కార్యక్రమంలో పనిచేసిన జోయెల్‌ ఏంజెల్‌ అనే ఇంజినీరు దీనిపై నిశితంగా దృష్టి సారించారు. అంతకు చాలా ఏళ్ల ముందే బెల్స్‌ సంస్థ కార్‌ ఫోన్‌ను తయారుచేసింది. ఇది ప్రయాణం చేస్తున్నప్పుడు ఫోన్‌తో మాట్లాడే అవకాశం కలిగించింది. దీనికి చాలా పెద్ద బ్యాటరీ అవసరమయ్యేది. అందుకే కారును వాడుకున్నారు. ఈ పరిజ్ఞానాన్ని మరింత తీర్చిదిద్ది, ఎక్కడికైనా తీసుకెళ్లే ఫోన్‌ను రూపొందించాలనేది జోయేల్‌ ప్రయత్నం. అదే సమయంలో మోటొరోలా సంస్థలో పనిచేస్తున్న మార్టిన్‌ కూపర్‌ కూడా ఇలాంటి పరికరాన్ని తయారుచేసే పనిలోనే నిమగ్నమయ్యారు. సెమీకండక్టర్‌, ట్రాన్సిస్టర్స్‌, ఫిల్టర్స్‌, యాంటెనా నిపుణులందరినీ కూడగట్టి మూడు నెలల పాటు అవిశ్రాంతంగా పనిచేశారు. ఎట్టకేలకు 1973, మార్చి చివరి నాటికి తాను అనుకున్నది సాధించారు. మొట్టమొదటి మొబైల్‌ ఫోన్‌ను ఆవిష్కరించారు. దీని పేరు డైనాటాక్‌ (డైనమిక్‌ అడాప్టివ్‌ టోటల్‌ ఏరియా కవరేజ్‌) ఫోన్‌. దీని బరువెంతో తెలుసా? కిలో పైనే. బ్యాటరీ కేవలం 25 నిమిషాల సేపే పనిచేసేది. ఇంత బరువైన ఫోన్‌ను చేత్తో పట్టుకోవటమే కష్టమనుకుంటే.. తక్కువ సేపే మాట్లాడే వీలుండటం మరో సమస్య. అయినా కూడా మార్టిన్‌కు ఇది ఎంతో సంతృప్తినిచ్చింది. ఆయనే దీంతో తొలి కాల్‌ చేశారు. అదీ జోయెల్‌ ఏంజెల్‌కు. ‘‘జోయెల్‌. నేను మార్టిన్‌ కూపర్‌. చేత్తో పట్టుకునే సెల్‌ ఫోన్‌తో నీతో మాట్లాడుతున్నా. ఇది నిజమైన సెల్‌ ఫోనే. చేత్తో పట్టుకోవచ్చు. ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. పర్సనల్‌ కూడా’’ అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అవతలి వైపు నుంచి నిశ్శబ్దం. బహుశా జోయెల్‌ అప్పుడు పళ్లు నూరుతుండొచ్చని మార్టిన్‌ ఆనాటి అనుభవాన్ని వర్ణిస్తారు.

పదేళ్ల తర్వాతే మార్కెట్‌లోకి

మార్టిన్‌ 1973లో మొట్టమొదటి మొబైల్‌ ఫోన్‌ కాల్‌ చేసినప్పటికీ పదేళ్ల తర్వాతే తొలి మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. మోటొరోలా సంస్థ డైనాటాక్‌ 8000ఎక్స్‌ ఫోన్‌ను 1983లో తీసుకొచ్చింది. అమెరికాలో దీని ధర అప్పట్లో 3,995 డాలర్లు! ఇటుక మాదిరిగా పెద్దగా, 33 సెంటీమీటర్ల పొడవుతో ఉండటం వల్ల దీన్ని బ్రిక్‌ అని ముద్దుగా పిలుచుకునేవారు. దీనికి పొడవైన యాంటెనాతో కూడా ఉండేది. తెర ఉండేది కాదు. అంత ఆకర్షణీయంగా లేకపోయినప్పటికీ కొత్త మొబైల్‌ శకానికి బాటలు వేసింది.

మొట్టమొదటి టెక్ట్స్‌ మెసేజ్‌

వొడాఫోన్‌ ఉద్యోగి రిచర్డ్‌ జార్విస్‌ 1992, డిసెంబర్‌ 3న మొట్టమొదటి టెక్ట్స్‌ మెసేజ్‌ను అందుకున్నారు. ఆయన కంప్యూటర్‌ అతడికి ‘మెర్రీ క్రిస్‌మస్‌’ అని శుభాకాంక్షలు అందించింది. ఈ మెసేజ్‌ను ఎన్‌ఎఫ్‌టీ రూపంలో  2021లో వేలం వేయగా 1.5 లక్షల డాలర్ల ధర పలికింది!

నోకియా ముద్ర

మొట్టమొదటి గ్లోబల్‌ సిస్టమ్‌ ఫర్‌ మొబైల్‌ (జీఎస్‌ం) ఫోన్‌ యూరప్‌లో 1991లో తొలిసారి మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. దీని పేరు ఆర్బిటల్‌ టీపీయూ 900. కాకపోతే వాణిజ్య కార్యకలాపాలకే పరిమతమైంది. ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా సంస్థ వినూత్న ఆవిష్కరణలతో మొబైల్‌ ఫోన్లకు సరికొత్త దిశను ప్రసాదించింది. 1997లో తీసుకొచ్చిన 6110 మోడల్‌తో మొబైల్‌ గేమ్‌ను ప్రవేశపెట్టింది. స్నేక్‌ ఆట చాలామందికి గుర్తుండే ఉంటుంది. రెండేళ్ల తర్వాత వచ్చిన 7110 మోడల్‌ మొదటిసారిగా వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌తో బ్రౌజింగ్‌ చేయటానికి వీలు కల్పించింది. నోకియా 2003లో 1100 మోడల్‌తో చవక ఫోన్‌ను పరిచయం చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించింది. 25 కోట్లకు పైగా ఫోన్లను అమ్మింది. అతి ఎక్కువగా అమ్ముడైన ఫోన్‌గా ఇది చరిత్ర సృష్టించింది.

కెమెరా తోడు

క్యోసెరా సంస్థ 1999లో మొట్టమొదటి కెమెరా ఫోన్‌ను పరిచయం చేసింది. దీని పేరు వీపీ-210. ఫోన్‌ ముందు భాగాన ఉండే దీని కెమెరా సెకండుకు రెండు ఫొటోలను పంపేది. ఇది జపాన్‌కు చెందిన పీహెచ్‌ఎస్‌ మొబైల్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థతో పనిచేసేది. మరో ఏడాది తర్వాత దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌ సంస్థ ఎస్‌సీహెచ్‌-వీ200 పేరుతో మరో కెమెరా మొబైల్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది 0.35ఎంపీ రెజల్యూషన్‌తో 20 వరకు ఫొటోలు తీసేది. వీటిని 1.5 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ తెర మీద చూసుకోవటానికీ వీలుండేది. అయితే ఫొటోలను నేరుగా ఇతరులకు పంపటానికి కుదిరేది కాదు. ఫోన్‌ భాగాన్ని పీసీకి కనెక్ట్‌ చేసి దానిలోంచి కంప్యూటర్‌లోకి ఫొటోలను బదిలీ చేసుకోవాల్సి వచ్చేది. అదే సంవత్సరం షార్ప్‌ సంస్థ జే-ఎస్‌హెచ్‌04 కెమెరా ఫోన్‌ను జపాన్‌లో విక్రయించటం మొదలెట్టింది. ఇందులో ఫోన్‌ హార్డ్‌వేర్‌కే కెమెరాను జత చేయటం విశేషం. దీంతో ఈమెయిల్‌ ద్వారా నేరుగా ఇతరులకు ఫొటోలను పంపటానికి వీలైంది, ఫోన్‌ ఫొటోగ్రఫీ పట్ల మక్కువ పెరిగింది. 2002లో వచ్చిన సోనీ ఎరిక్‌సన్‌ టీ68ఐతో మరింత పుంజుకుంది. పాశ్చాత్య దేశాలూ కెమెరా ఫోన్ల ఉత్పత్తిని ఆరంభించాయి. అలా అమెరికాలో సాన్యో ఎస్‌సీపీ-5300 అనే తొలి కెమెరా ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది.

తొలి రంగుల ఫోన్‌

మొట్టమొదటి రంగుల డిస్‌ప్లే ఫోన్‌ 1997లో ఆవిష్కృతమైంది. అదే సీమన్స్‌ ఎస్‌10. కేవలం నాలుగు రంగులతోనే అలరించినా కలర్‌ ఫోన్ల రంగంలో కొత్త శకానికి నాంది పలికింది. అదే సంవత్సరం హేగ్‌నక్‌ సంస్థ బయటికి యాంటెనా లేని తొలి ఫోన్‌ను తీసుకొచ్చింది. అనంతరం ఎరిక్‌సన్‌ సంస్థ రంగుల కీబోర్డు ప్యానెల్స్‌ను ప్రవేశ

ఐఫోన్‌ ధమాకా

‘‘యాపిల్‌ ఈరోజు ఫోన్‌ను పునర్‌ ఆవిష్కరించనుంది’’ కిక్కిరిసిన జన సమూహానికి ఐఫోన్‌ను పరిచయం చేస్తూ స్టీవ్‌ జాబ్స్‌ 2007లో పలికిన మాటలివి. ఆయన ఊహించినట్టే స్మార్ట్‌ఫోన్ల రంగంలో ఐఫోన్‌ కొత్త చరిత్ర సృష్టించింది. ఏటా కొత్త మోడళ్లను, ఐఓఎస్‌ అప్‌డేట్లను విడుదల చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ ప్రియులను ఆకట్టుకుంటూనే వస్తోంది. టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే, వర్చువల్‌ కీబోర్డుల వంటి ఎన్నో ఫీచర్లకు బీజం వేసింది. ఇప్పటివరకు 224 కోట్ల ఐఫోన్లు అమ్ముడయ్యాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 174 కోట్లకు పైగా మంది ఐఫోన్‌ను వాడుతున్నారంటే ఎంతటి ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.

తొలి ఆండ్రాయిడ్‌ ఫోన్‌

హెచ్‌టీసీ సంస్థ 2008లో డ్రీమ్‌ పేరుతో కొత్తరకం స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వాణిజ్యపరంగా విడుదలైన మొట్టమొదటి లైనక్స్‌ ఆధారిత ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఇదే. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను గూగుల్‌, ఓపెన్‌ హ్యాండ్‌సెట్‌ అలయన్స్‌ కొని, మరింత అభివృద్ధి చేశాయి.
మెసెంజర్ల వెల్లువ వాట్సప్‌ 2009లో ఆరంభమైంది. అనంతరం దీని బాటలోనే వైబర్‌, వీచాట్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌ వంటి ఎన్నో మెసెంజర్‌ యాప్‌లు పుట్టుకొచ్చాయి. ఇంటర్నెట్‌తో సందేశాలను చేరవేసే ఇవి అనతికాలంలోనే బహుళ ప్రాచుర్యం పొందాయి. మూడేళ్లలోనే ఎస్‌ఎంఎస్‌లనూ తల దన్నాయి.

మెసెంజర్ల వెల్లువ

వాట్సప్‌ 2009లో ఆరంభమైంది. అనంతరం దీని బాటలోనే వైబర్‌, వీచాట్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌ వంటి ఎన్నో మెసెంజర్‌ యాప్‌లు పుట్టుకొచ్చాయి. ఇంటర్నెట్‌తో సందేశాలను చేరవేసే ఇవి అనతికాలంలోనే బహుళ ప్రాచుర్యం పొందాయి. మూడేళ్లలోనే ఎస్‌ఎంఎస్‌లనూ తల దన్నాయి.

ఎమోజీ వరద

యాపిల్‌ సిరి 2011లో పరిచయమైంది. మాటలతోనే ఐఫోన్‌ 4ఎస్‌ ద్వారా మెసేజ్‌లను పంపటానికి, అపాయింట్‌ మెంట్లను సెట్‌ చేసుకోవటానికి, కాల్స్‌ చేసు కోవటానికి మాత్రమే కాదు.. ఇంటర్నెట్‌ శోధనకూ ఇది వీలు కల్పించింది. అనంతం గూగుల్‌, అమెజాన్‌ సైతం ఇదే బాటలో వాయిస్‌ అసిస్టెంట్లను ప్రవేశపెట్టాయి. అదే సంవత్సరం చిన్న ముఖాలతో కూడిన ఎమోజీల వరద మొదలైంది. షిగెటకా కుర్టియీ గీసిన ఇవి ఐఫోన్‌ క్యారెక్టర్‌ ల్రైబరీలో భాగమయ్యాయి.

మడత ఫోన్లు

సామ్‌సంగ్‌, హువావీ కంపెనీలు 2019లో తొలిసారిగా గెలాక్సీ ఫోల్డ్‌, మేట్‌ ఎక్స్‌ పేర్లతో మడత స్క్రీన్‌ ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని