ఆశగా నిరీక్షిస్తూ... ఎంఎస్‌ఎంఈలు!

భారత్‌లో తయారీ, ఉపాధి, ఎగుమతుల పరంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈల) పాత్ర కీలకమైంది. కొన్నేళ్లుగా వరస ఎదురు దెబ్బలు వాటిని కకావికలం చేశాయి.

Published : 29 Jan 2023 00:09 IST

భారత్‌లో తయారీ, ఉపాధి, ఎగుమతుల పరంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈల) పాత్ర కీలకమైంది. కొన్నేళ్లుగా వరస ఎదురు దెబ్బలు వాటిని కకావికలం చేశాయి. రాబోయే కేంద్ర బడ్జెట్లో వాటికి మరింత ఊతం దక్కాలని ఎంఎస్‌ఎంఈ వర్గాలు ఆశిస్తున్నాయి.

దేశీయంగా నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల తీవ్రంగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్‌ఎంఈలను) కొవిడ్‌ తీవ్రంగా కుంగదీసింది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వాటిని మరింతగా దెబ్బతీసింది. వైరస్‌ వల్ల ఎంఎస్‌ఎంఈలకు అవసరమైన ముడి సరకుల సరఫరాలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు చుక్కలనంటడం, ద్రవ్యోల్బణం విజృంభించి వడ్డీ రేట్లు పెరగడంతో చాలా ఎంఎస్‌ఎంఈలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. కొవిడ్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు వాటిని ఆదుకోవడానికి కేంద్రం అత్యవసర రుణ హామీ పథకాన్ని తెచ్చింది. అయితే, ఆ అరకొర సాయం అంతగా ఆదరువును అందివ్వలేదని పార్లమెంటరీ స్థాయీ సంఘం గతంలోనే కుండ బద్దలుకొట్టింది. కరోనా తాకిడి నుంచి ఎంఎస్‌ఎంఈలు ఇప్పుడిప్పుడే కాస్త తేరుకొంటున్నాయి. ఈ తరుణంలో రాబోయే బడ్జెట్లో వాటికి మరిన్ని ప్రోత్సాహకాలు లభించాలని ఆయా పరిశ్రమల వర్గాలు కోరుతున్నాయి.

చెల్లింపుల్లో జాప్యం

ఇండియాలో ఆరు కోట్లకు పైగా ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. వాటిలో 90శాతానికి పైగా సూక్ష్మ తరహా సంస్థలే. భారత జీడీపీలో 30శాతం, ఎగుమతుల్లో 48శాతం వాటా ఎంఎస్‌ఎంఈలదే. శ్రామిక శక్తిలో 40శాతానికి అవి ఉపాధి కల్పిస్తున్నాయి. కొవిడ్‌ కారణంగా చాలా ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఎన్నో పరిశ్రమలను మూలధనం కొరత వేధిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాబోయే బడ్జెట్లో వడ్డీ రాయితీలు కల్పించడంతో పాటు ఎంఎస్‌ఎంఈలకు రుణ లభ్యతను పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాబోయే మూడేళ్లలో భారత్‌ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే ఎంఎస్‌ఎంఈలకు మెరుగైన రుణ సదుపాయం కల్పించడం అత్యావశ్యకమని నిరుడు నవంబరులో కేపీఎంజీ నివేదిక విశ్లేషించింది. 

ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా దేశీయంగా తయారీని, ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్రం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకాన్ని తెచ్చింది. అందులో ఎంఎస్‌ఎంఈలకు అంతగా ప్రాధాన్యం దక్కలేదని, దాన్ని మరిన్ని విభాగాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఎగుమతులు మరింత ఊపందుకొంటాయని విశ్లేషిస్తున్నారు. తోలు, ఇతర పాదరక్షల విభాగానికి పీఎల్‌ఐను విస్తరింపజేయాలని కేంద్రాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరింది. రాబోయే బడ్జెట్లో తమకూ కొన్ని ప్రోత్సాహకాలు అందించాలని అంకుర సంస్థలు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా పీఎల్‌ఐ పథకం మాదిరిగా డ్రోన్ల విభాగంలో అంకుర సంస్థలకు సేవా అనుసంధాన ప్రోత్సాహక (ఎస్‌ఎల్‌ఐ) పథకాన్ని తేవాల్సిన అవసరాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు.

నిరుడు కేంద్ర బడ్జెట్లో ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి దిగుమతి సుంకాల తగ్గింపు, అత్యవసర రుణ వితరణ పథకం పొడిగింపు, డిజిటల్‌ బ్యాంకుల ఏర్పాటు, ఉద్యమ్‌ పోర్టల్‌ నవీకరణ, రుణ హామీ పథకాన్ని ప్రక్షాళించడం, మౌలిక వసతులకు సంబంధించి గతిశక్తి పథకం వంటి ప్రకటనలు ఉన్నాయి. రాబోయే పద్దులో ఎంఎస్‌ఎంఈల పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. చెల్లింపుల్లో తీవ్ర జాప్యం సైతం ఇబ్బందిగా మారింది. దానివల్ల ఎంఎస్‌ఎంఈల సామర్థ్యం, వృద్ధి మాత్రమే కాకుండా మొత్తం భారత ఆర్థిక వ్యవస్థలో పోటీతత్వం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాధాన్‌ పోర్టల్‌ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ఇతర విభాగాల నుంచి ఎంఎస్‌ఎంఈలకు ఆరున్నర వేల కోట్ల రూపాయల బకాయిలు అందాల్సి ఉంది. వాటికి సంబంధించి ప్రస్తుతం దాదాపు ముప్ఫై వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. జాప్యానికి తావు లేకుండా చెల్లింపులు వెంటనే జరిగేలా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని పరిశ్రమల నిర్వాహకులు కోరుతున్నారు. దిగుమతి సుంకాలను మరింతగా తగ్గించడం వల్ల దేశీయంగా ఎంఎస్‌ఎంఈల మధ్య పోటీతత్వం పెరిగి మరింత మెరుగైన ఉత్పత్తుల తయారీకి అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు.

మరింత ప్రోత్సాహం...

మొత్తం ఉత్పత్తుల్లో 50శాతానికి మించి ఎగుమతి చేస్తున్న ఎంఎస్‌ఎంఈలకు రాబోయే బడ్జెట్లో విద్యుత్తు సుంకాలు ఎత్తివేయాలని పలువురు కోరుతున్నారు. పూచీకత్తు లేని రుణాల పరిమితిని ప్రస్తుతం ఉన్న కోటి రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయలకు పెంచేలా బడ్జెట్లో ప్రకటన ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు ప్రపంచ స్థాయి సంస్థలు వినియోగించే ఉత్పత్తులు, సేవలను అందించే అంకుర సంస్థల కోసం కేంద్రం బడ్జెట్లో ప్రత్యేక విధానాలు ప్రకటించాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆశిస్తున్నారు. ఎంఎస్‌ఎంఈలలో దాదాపు 52శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే కొలువుతీరాయి. స్థానికంగా అవి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామీణంలో వ్యవసాయ సంక్షోభం వల్ల ఎంతోమంది పొట్ట చేతపట్టుకొని నగరాలకు వలసవెళ్తున్నారు. దీన్ని నివారించాలంటే ఎంఎస్‌ఎంఈలకు రానున్న పద్దులో మెరుగైన ప్రోత్సాహకాలు దక్కేలా చూడటం అత్యావశ్యకం.

 ఎం.వి.బాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.