Love marriage: నచ్చినవాడి కోసం.. రూ.2వేల కోట్ల ఆస్తిని వదులుకొని..!

సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ యువతి.. సాదాసీదా వ్యక్తిని ప్రేమించింది (Love). తల్లిదండ్రులు నిరాకరించినా చివరకు అతడినే పెళ్లాడిన ఆమె.. వారసత్వంగా వచ్చిన రూ.వేల కోట్ల ఆస్తిని కూడా కాదనుకుంది.

Published : 15 Aug 2023 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ యువతి.. సాదాసీదా వ్యక్తిని ప్రేమించింది (Love). అతడే తనకు ముఖ్యం అనుకుంది. తల్లిదండ్రులు నిరాకరించినా.. అతడితోనే పెళ్లికి సిద్ధమైంది. అంతేకాదు, వారసత్వంగా వచ్చిన రూ.వేల కోట్ల ఆస్తిని కూడా కాదనుకుంది. మలేసియా బిజినెస్‌ టైకూన్‌ (Malaysian tycoon) కుమార్తె అయిన ఆ అమ్మాయి.. ప్రియుడి కోసం అన్నీ వదులుకొని ఇంటినుంచి బయటకు వెళ్లి నచ్చిన జీవితం కొనసాగిస్తోంది.

మలేసియాకు చెందిన ఏంజెలినా ఫ్రాన్సిస్‌ (Angeline Francis Khoo).. ప్రముఖ వ్యాపారవేత్త ఖూ కే పెంగ్‌, మాజీ మిస్‌ మలేసియా పాలైన్‌ ఛాయ్‌ దంపతుల కుమార్తె. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో (Oxford University) చదువుకుంటున్న సమయంలో జెడియా  అనే స్నేహితుడితో ప్రేమలో పడింది. వివాహం చేసుకునేందుకు సిద్ధమైన ఆమె.. ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపింది. కానీ, వారు మాత్రం అందుకు నిరాకరించారు. ఆర్థికపరంగా ఇరు కుటుంబాల్లో భారీ తేడా ఉందన్న వారు.. అతడిని దూరం కావడమో లేదా వారసత్వాన్ని వదులుకోవడమో చేయాలని ఆదేశించారు. చివరకు ప్రియుడితోనే స్థిరపడాలని నిశ్చయించుకున్న ఆమె.. ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది. 2008లో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో వారసత్వంగా వచ్చే సుమారు రూ.2వేల కోట్ల ఆస్తినీ వదులుకుంది.

వివాహం అనంతరం ఇద్దరు కూడా వారి రెండు కుటుంబాలకు దూరంగానే ఉన్నారు. అయితే, చాలారోజులు దూరంగా ఉన్న ఫ్రాన్సిస్‌.. ఓసారి వారి తల్లి దండ్రులను కలవాల్సి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడమే అందుకు కారణం. న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చేందుకు ఫ్రాన్సిస్‌ కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో తన తల్లి గురించి గొప్పగా వివరించిన ఆమె.. కుటుంబం కోసం ఆమె చేసిన సేవలను కొనియాడింది. తండ్రిపై మాత్రం విమర్శలు గుప్పించింది. ఏదేమైనా తల్లిదండ్రులిద్దరూ తిరిగి కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని చెప్పిన ఆమె ప్రేమ కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు