Ukraine Crisis: ‘మామ్‌.. ఈ యుద్ధం చాలా కష్టంగా ఉంది’.. రష్యన్‌ సైనికుడి చివరి సందేశం

‘‘మామ్‌..నేను ఉక్రెయిన్‌లో ఉన్నా. నాకు చాలా భయంగా ఉంది. ఈ యుద్ధం చాలా కష్టంగా ఉంది. మేం పౌరులను కూడా లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోంది’’.. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ రష్యన్‌ సైనికుడు

Published : 02 Mar 2022 01:20 IST

ఐరాసలో చదివి వినిపించిన ఉక్రెయిన్‌ రాయబారి

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘మామ్‌..నేను ఉక్రెయిన్‌లో ఉన్నా. నాకు చాలా భయంగా ఉంది. ఈ యుద్ధం చాలా కష్టంగా ఉంది. మేం పౌరులను కూడా లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోంది’’.. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ రష్యన్‌ సైనికుడు తన తల్లికి పంపిన చివరి సందేశం ఇది. ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా కూడా భారీ మూల్యం చెల్లించుకుంటోంది అనడానికి ఇదే నిదర్శనం. యుద్ధంతో ఉక్రెయిన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోన్న రష్యా.. వేలాది మంది సొంత సైనికులనూ పోగొట్టుకుంటోంది.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య క్రమంలో... ఐక్య రాజ్య సమితి (ఐరాస)సాధారణ సభ సోమవారం అత్యవసరంగా ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఐరాసకు ఉక్రెయిన్‌ రాయబారి సెర్గీ కిస్లెత్స్యా మాట్లాడుతూ.. రష్యా దురాక్రమణను ఎండగట్టారు. ఈ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ రష్యన్ సైనికుడు తన తల్లికి చివరిసారిగా పంపిన సందేశాన్ని సెర్గీ చదివి వినిపించారు. ఆ సైనికుడి ఫోన్‌ నుంచి ఈ మెసేజ్‌ను సేకరించినట్లు సెర్గీ వెల్లడించారు.

సెర్గీ చెప్పిన ఆ తల్లీకొడుకుల సంభాషణ ఇలా ఉంది..

సైనికుడి తల్లి: ఎక్కడున్నావ్‌ నాన్నా..? నేను నీకు ఒక పార్సిల్‌ పంపాలి.

రష్యన్‌ సైనికుడు: నాకు ఉరేసుకుని చచ్చిపోవాలని ఉంది మామ్‌. 

తల్లి: ఏం మాట్లాడుతున్నావ్‌..? ఏం జరిగింది?

రష్యన్‌ సైనికుడు: మామ్‌, నేను ఉక్రెయిన్‌లో ఉన్నా. ఇక్కడ నిజమైన యుద్ధం జరుగుతోంది. నాకు చాలా భయంగా ఉంది. మేం అన్ని నగరాలపైనా బాంబులు విసురుతున్నాం. పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాం. వారు(ఉక్రెయిన్‌ వాసులు) మమ్మల్ని స్వాగతిస్తారని మా అధికారులు చెప్పారు. కానీ వారు(ఉక్రెయిన్‌ సైనికులు) మా సాయుధ వాహనాల కింద పడుతున్నారు. చక్రాలకు అడ్డుపడి మమ్మల్ని కదలనివ్వట్లేదు. మమ్మల్ని ఫాసిస్ట్‌లు అంటున్నారు. ఇది చాలా కష్టంగా ఉంది మామ్‌. 

ఇదే ఆ సైనికుడు తన తల్లికి.. చనిపోయే ముందు పంపిన చివరి సందేశమని, ఆ తర్వాత ఉక్రెయిన్‌ జరిపిన ప్రతిదాడిలో ఆ రష్యన్‌ సైనికుడు మరణించాడని సెర్గీ ఐరాస వేదికపై తెలిపారు. పుతిన్‌ దురాక్రమణ కారణంగా వేలాది మంది రష్యన్‌ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని, ఇప్పటికైనా ఈ దారుణాలను ఆపాలని ప్రపంచ వేదికపై సెర్గీ అభ్యర్థించారు.

రష్యా దాడులను ఉక్రెయిన్‌ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 4500 మందికి పైగా రష్యా జవాన్లను చంపినట్లు ఉక్రెయిన్‌ ఇప్పటికే ప్రకటించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ విషయాన్ని చెబుతూ..‘‘రష్యన్‌ సైనికులు తమ ప్రాణాలను కాపాడుకోవాలంటే ఉక్రెయిన్‌ను వీడి వెళ్లిపోవాలి’’ అని పలుమార్లు గట్టిగానే హెచ్చరించారు.

అయితే ఉక్రెయిన్‌ ప్రకటనను రష్యా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. తమవైపు ఎలాంటి ప్రాణనష్టం లేదని చెబుతోంది. అయితే రష్యన్ సైనికులను ఉక్రెయిన్‌ జవాన్లు బంధీగా పట్టుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వస్తూనే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని