
గ్రేటర్ హైదరాబాద్
హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్: కేంద్రం తీసుకువచ్చిన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్) చట్టం అమలుకు కట్టుబడి ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఇప్పటికే శాసనసభ, మండలి ఆమోదం తెలిపాయని, త్వరలో అమల్లోకి తీసుకువస్తామని పేర్కొంది. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ‘ఫోరం ఎగెనెస్ట్ కరప్షన్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ చట్టం కింద ఆసుపత్రులపై ఫిర్యాదు చేయడానికి వీలుగా ఎన్ఫోర్స్మెంట్ సెల్, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కేంద్రాన్ని, ఫోన్ నంబరును ఏర్పాటు చేయాల్సి ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్కుమార్ వాదనలు వినిపిస్తూ తప్పు చేసిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర చట్టాన్ని అమలు చేయడానికి కొంత గడువు అవసరమని తెలిపారు. దీనికి ధర్మాసనం అనుమతిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.