
తాజా వార్తలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టెండర్లు: సింఘాల్
తిరుమల: తితిదే ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని ఈవో అనిల్కుమార్ సింఘాల్ అన్నారు. వివాదాలకు తావులేకుండా పూర్తిస్థాయి పరిశీలన తర్వాత శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాటుకు టెండర్లు నిర్వహిస్తున్నామని, అప్పటి పరిస్థితుల మేరకు నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ నెల వరకు తితిదేకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేవన్నారు. 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, తలనీలాల విలువ పెరగడంతో రూ.7 కోట్ల ఆదాయం అదనంగా సమకూరిందని వెల్లడించారు.
మరోవైపు 91 మంది తితిదే ఉద్యోగులకు కరోనా సోకినట్లు సింఘాల్ తెలిపారు. తిరుమలకు వచ్చి పరీక్ష చేయించుకున్న ఏ ఒక్క భక్తుడికీ కరోనా సోకలేదన్నారు. అలిపిరి వద్ద 1704, తిరుమలలో 1865 మంది తితిదే ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించామన్నారు. 631 మంది యాత్రికులకు పరీక్షలు చేశామన్నారు.జూన్ 11 నుంచి జులై 10 వరకు హుండీ ఆదాయం రూ.16.73 కోట్లు వచ్చినట్లు ఈవో వెల్లడించారు. 13.36 లక్షల లడ్డూలు విక్రయించినట్లు తెలిపారు. 1.64 లక్షల మంది భక్తులు ఆన్లైన్ ద్వారా, 85,434 మంది కౌంటర్ ద్వారా టికెట్లు బుక్ చేసుకొని దర్శనం చేసుకున్నారని, టికెట్లు బుక్ చేసుకున్న 30 శాతం మంది తిరుమల యాత్రను రద్దు చేసుకున్నారని సింఘాల్ వివరించారు.