ప్రతిభావంతులకు ప్రభుత్వ ఆసరా

ప్రతిభావంతులైన ఎందరో విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు   అవరోధమవుతున్నాయి. ఇలాంటి వారు ఎలాంటి ఆటంకం లేకుండా చదువులు కొనసాగించడానికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తోంది. ఇంటర్మీడియట్‌ తర్వాత ఏదైనా యూజీలో ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ప్రధానమంత్రి ఉచ్ఛతర్‌ శిక్షా ప్రోత్సాహన్‌ (పీఎం-యూఎస్‌పీ) సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ పేరుతో వీటిని అందిస్తున్నారు.

Updated : 19 Oct 2023 03:12 IST

పీఎం-యూఎస్‌పీ స్కాలర్‌షిప్పులు  

ప్రతిభావంతులైన ఎందరో విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు   అవరోధమవుతున్నాయి. ఇలాంటి వారు ఎలాంటి ఆటంకం లేకుండా చదువులు కొనసాగించడానికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తోంది. ఇంటర్మీడియట్‌ తర్వాత ఏదైనా యూజీలో ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ప్రధానమంత్రి ఉచ్ఛతర్‌ శిక్షా ప్రోత్సాహన్‌ (పీఎం-యూఎస్‌పీ) సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ పేరుతో వీటిని అందిస్తున్నారు. సీనియర్‌  సెకెండరీ/ఇంటర్మీడియట్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రోత్సాహం అందుతుంది!

ఉపకార వేతనాలకు ప్రస్తుతం ఏదైనా  యూజీ లేదా ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిభావంతులకు రోజువారీ అవసరాలను తీర్చడానికి వీటిని ఏర్పాటుచేశారు. యూజీ నుంచి పీజీ వరకు ఐదేళ్లపాటు ఈ ఉపకార వేతనాలు అందుతాయి. బీటెక్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్నవారికి నాలుగేళ్ల వరకు చెల్లిస్తారు. సాధారణ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్‌ పీజీలు చదువుతున్నవారికి ఏడాదికి రూ.12,000 చొప్పున మొదటి మూడేళ్లు వారి బ్యాంకు ఖాతాలో వేస్తారు. పీజీలో చేరినప్పుడు ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు అందిస్తారు. బీటెక్‌ విద్యార్థులైతే నాలుగో ఏడాది రూ.20,000 ఇస్తారు.

ఎవరు అర్హులు?  

  • 2022-2023 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ /+2 కోర్సులు పూర్తిచేసుకున్నవారే అర్హులు.
  • ఇంటర్‌ లేదా ప్లస్‌2లో 80 పర్సంటైల్‌ కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. అంటే ఆ బోర్డు పరిధిలో టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాలి.
  • రెగ్యులర్‌ విధానంలో చదివినవాళ్లే అర్హులు. డిప్లొమా విద్యార్థులకు అవకాశం లేదు.
  • తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.4.5 లక్షల లోపు ఉండాలి.
  • ఇతర ఏ స్కాలర్‌షిప్పులనూ పొందనివారే దీనికి అర్హులు.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించినవాళ్లు అనర్హులు.
  • స్కాలర్‌షిప్పులకు ఎంపికైనవాళ్లు తర్వాత ఏడాదిల్లోనూ వీటిని పొందడానికి అంతకుముందు విద్యా సంవత్సరంలో కనీస హాజరు ఉండాలి. నిర్దేశిత మార్కుల శాతం తప్పనిసరి.

కేటాయింపు ఇలా...

దేశవ్యాప్తంగా మొత్తం 82,000 స్కాలర్‌షిప్పులు ఉన్నాయి. వీటిని రాష్ట్రాలవారీ విభజించారు. ఇందుకు రాష్ట్రాలవారీ 18-25 ఏళ్ల వయసు జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నారు. రాష్ట్రాల వారీ సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతంతోనూ మదింపు చేస్తారు. రాష్ట్రాలవారీ కేటాయించిన స్కాలర్‌షిప్పుల్లో సైన్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌ విద్యార్థులను 3:2:1 విధానంలో ఎంపికచేస్తారు. అలాగే మొత్తం స్కాలర్‌షిప్పుల్లో 50 శాతం అమ్మాయిలకు దక్కుతాయి.

రిజర్వేషన్‌: ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 5 శాతం స్కాలర్‌షిప్పులు కేటాయించారు.

దరఖాస్తులు: విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం సంబంధిత స్కాలర్‌షిప్‌ పత్రాన్ని ఆన్‌లైన్‌లో పూరించాలి. అవసరమైన పత్రాలను జత చేయాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 31

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని