Apply Now: పేద విద్యార్థులకు ఓఎన్జీసీ స్కాలర్షిప్పులు
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సాయం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిభావంతులైన వారిని గుర్తించి వారికి ఏటా ₹48వేలు చొప్పున స్కాలర్షిప్లకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది.
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) ముఖ్యమైంది. చమురు, సహజవాయువుల విభాగంలో ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఫౌండేషన్ విభాగం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి ఏటా స్కాలర్షిప్పులు అందిస్తోంది. ఇటీవలే ఆ ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలివే..
ఓఎన్జీసీ ఏటా మొత్తం 2000 ఉపకార వేతనాలు అందిస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్ అభ్యర్థులకు 500 చొప్పున కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్షిప్పులు మహిళలకు దక్కుతాయి. వీటికి దరఖాస్తు చేసుకోవ డానికి సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయ్యేంతవరకూ ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది.
- ఎవరికి?: దేశంలో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీల్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు..
- అర్హతలేంటి?: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా 2023-2024 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్మీడియట్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల వరకు అవకాశం ఉంటుంది.
- ఎంపిక విధానం: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులకు ఇంటర్మీడియట్లో చూపిన ప్రతిభ ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సులకు డిగ్రీలో ప్రతిభ ప్రాతిపదికన స్కాలర్షిప్పులు మంజూరు చేస్తారు.
- స్కాలర్షిప్పు వ్యవధి: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరినవారికి నాలుగేళ్లు; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున చెల్లిస్తారు.
వయసు: అక్టోబరు 16, 2023 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి.
నిబంధనలు
వేరే ఏ ఉపకార వేతనాలూ మంజూరు కానివాళ్లే ఓఎన్జీసీ ప్రోత్సాహకాలకు అర్హులు. ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందేవాళ్లూ ఈ స్కాలర్షిప్పునకు అర్హులే. ఎంపికైనవారి వివరాలను ఓఎన్జీసీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. కేవలం పైన తెలిపిన కోర్సుల్లో భారత్లో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
కొనసాగాలంటే
స్కాలర్షిప్పు ఏటా కొనసాగడానికి వార్షిక పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అంతకంటే తక్కువ మార్కులు పొందితే ఆ తర్వాత విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్పు అందదు.
దరఖాస్తు: ఓఎన్జీసీ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలి. ప్రవేశపత్రం, ఫొటో, కుల ధ్రువీకరణ పత్రం, కాలేజ్ ఐడీ కార్డు, ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ మార్కు షీట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం.. వీటిని అప్లోడ్ చేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
వెబ్సైట్: https://ongcscholar.org/#/
కోర్సులు, కేటగిరీలవారీ...
- ఇంజినీరింగ్: 500 (ఎస్సీ, ఎస్టీ), 300 ఓబీసీ, 300 జనరల్
- ఎంబీబీఎస్: 90 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్
- ఎంబీఏ: 140 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్
- జియాలజీ/ జియోఫిజిక్స్: 270 (ఎస్సీ, ఎస్టీ), 100 ఓబీసీ, 100 జనరల్.
దేశాన్ని 5 జోన్లగా విభజించారు. ఒక్కో జోన్ నుంచి ఎస్సీ, ఎస్టీలకు 200, ఓబీసీలకు 100, జనరల్ అభ్యర్థులకు 100 చొప్పున వీటిని ఇస్తారు. అభ్యర్థులు చదువుతోన్న కళాశాల ఉన్న రాష్ట్రం ప్రకారం జోన్ నిర్ణయిస్తారు. ఏపీ, తెలంగాణలు జోన్ 5 పరిధిలో ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.