Scholarships: రిలయన్స్ ఫౌండేషన్.. 5000 స్కాలర్షిప్పులు
మీరు ఏదైనా డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? రూ.2 లక్షల ఆర్థిక ప్రోత్సాహం పొందాలనుకుంటున్నారా? అయితే రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్పులు సిద్ధంగా ఉన్నాయి.
మీరు ఏదైనా డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? రూ.2 లక్షల ఆర్థిక ప్రోత్సాహం పొందాలనుకుంటున్నారా? అయితే రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్పులు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నత విద్యావంతులను చేసి, దేశాభివృద్ధిలో భాగమయ్యేలా 5000 స్కాలర్షిప్పులను ఈ సంస్థ ప్రకటించింది. పరీక్షలో చూపిన ప్రతిభ, అకడమిక్ నేపథ్యం, వ్యక్తిగత సమాచారంతో అర్హులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు, పరీక్షల నిమిత్తం ఎలాంటి రుసుమూ
చెల్లించనవసరం లేదు!
పదేళ్లలో యాభై వేల మంది విద్యార్థులకు స్కాలర్షిప్పులను అందించాలని రిలయన్స్ ఫౌండేషన్ 2022లో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది 2022-2023 విద్యా సంవత్సరంలో 5000 మంది అండర్ గ్రాడ్యుయేట్లకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది 2023-2024 విద్యా సంవత్సరానికి మరో 5000 మందికి అవకాశం కల్పిస్తుంది. వీటికి ఎంపికైనవారికి కోర్సు పూర్తయ్యేంతవరకూ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరిట్ కం మీన్స్ ప్రాతిపదికన అందిస్తున్నారు. ఎంపికైనవారు తమ డిగ్రీ వ్యవధిలో రూ.2 లక్షల వరకు ప్రోత్సాహం పొందవచ్చు. ఈ మొత్తాన్ని ట్యూషన్/ హాస్టల్ ఫీజు, ల్యాప్టాప్, అకడమిక్ పుస్తకాలు, కోర్సుల కోసం వినియోగించుకోవచ్చు. వీరికి రిలయన్స్ ఫౌండేషన్ నుంచి కెరియర్పరమైన సహకారమూ లభిస్తుంది. ఏటా కొంత మొత్తాన్ని విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. నగదు ప్రోత్సాహంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, వర్క్షాపులు, అలమ్నీ నెట్వర్క్తో అనుసంధానం మొదలైనవన్నీ అదనంగా లభిస్తాయి.
ఎంపిక
విద్యార్థులు రిలయన్స్ ఫౌండేషన్ వెబ్సైట్లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకోసం ఫీజు చెల్లించనవసరం లేదు. విజయవంతంగా దరఖాస్తు పూర్తిచేసుకున్నవారికి ఏ తేదీ, ఏ సమయంలో ఆన్లైన్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారో సమాచారం అందుతుంది. ఇది రిమోట్ ప్రోక్టర్డ్ విధానంలో ఉంటుంది. ఇంటర్నెట్ సౌకర్యంతో కంప్యూటర్/ల్యాప్టాప్ ఉన్నవారు ఇంటి వద్ద నుంచే ఈ ఆన్లైన్ పరీక్ష రాసుకోవచ్చు లేనివారు ఏదైనా ఇంటర్నెట్ కేంద్రానికి వెళ్లి పూర్తిచేసుకోవచ్చు. కెమెరా, మైక్రోఫోన్ ఆన్లో ఉంచాలి. వాటిద్వారా పర్యవేక్షణ ఉంటుంది.
పరీక్ష వ్యవధి ఒక గంట. 60 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వస్తాయి. వెర్బల్, ఎనలిటికల్ అండ్ లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు ఒక్కో విభాగం నుంచీ 20 చొప్పున ఉంటాయి. ప్రతి సెక్షన్నూ 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. వెర్బల్ ఎబిలిటీలో.. స్పాటింగ్ ఎర్రర్, సెంటెన్స్ కంప్లీషన్, గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు వస్తాయి. ఎనలిటిక్ అండ్ లాజికల్ ఎబిలిటీలో.. సమస్యను విశ్లేషించడం, కారణాలు కనుక్కోవడం, పరిష్కారాన్ని గుర్తించడంపై ప్రశ్నలుంటాయి. న్యూమరికల్ ఎబిలిటీలో.. రేషియో, పర్సంటేజీ, నంబర్ సీక్వెన్స్, డేటా ఇంటర్ప్రెటేషన్ నుంచి వీటిని అడుగుతారు.
మాదిరి ప్రశ్నపత్రాన్ని సంస్థ వెబ్సైట్లో పొందుపరిచారు. ఆప్టిట్యూడ్ టెస్టు స్కోరు, అకడమిక్, పర్సనల్ సమాచారం ఆధారంగా అర్హులను ఎంపికచేస్తారు. విద్యార్థినులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైనవారి వివరాలు డిసెంబరులో ప్రకటిస్తారు.
అర్హత
మొదటి సంవత్సరం ఏదైనా యూజీ కోర్సులు రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారే వీటికి దరఖాస్తు చేసుకోవాలి. గరిష్ఠ వయసు నిబంధన లేదు.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉంటేనే అర్హులు. రూ.2.5 లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యం.
ఇంటర్/ప్లస్ 2లో 60 శాతం మార్కులు ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 15
వెబ్సైట్: https://www.scholarships.reliancefoundation.org/
ఇంటర్ విద్యార్థినుల కోసం...
మీరు బాలికలా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? అయితే మీకోసమే సీబీఎస్ఈ స్కాలర్షిప్పులు సిద్ధంగా ఉన్నాయి.
ఈ ఉపకార వేతనాల కోసం సీబీఎస్ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. వీటిని రెండేళ్లు అంటే ఇంటర్మీడియట్/ప్లస్ 2 వరకు చెల్లిస్తారు. ప్లస్1 లో 50 శాతం మార్కులు పొందితేనే ప్లస్2 లో ఈ స్కాలర్షిప్పు కొనసాగుతుంది.
ఎవరు అర్హులు?
సీబీఎస్ఈ గుర్తింపు పొందిన పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసినవారై ఉండాలి. మొదటి 5 సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు సాధించాలి. పదో తరగతిలో ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500కు మించి ఉండరాదు. 11, 12 తరగతుల్లో దీనికి 10 శాతం కంటే మించరాదు. వీరు ప్రస్తుతం సీబీఎస్ఈ ప్లస్1 చదువుతుండాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 18
వెబ్సైట్: https://www.cbse.gov.in/cbsenew/cbse.html
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
-
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
-
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు