ఉద్యోగులపై లాఠీలు ఝుళిపించడం దుర్మార్గం
ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులపై లాఠీలు ఝులిపించడం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
ఈనాడు డిజిటల్, అమరావతి : ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులపై లాఠీలు ఝులిపించడం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గతంలో తెదేపా హయాంలో 43 శాతం పీఆర్సీ ఇస్తే తప్పుబట్టిన సీఎం జగన్.. నేడు అసలు వేతనాలకే ఎసరు పెట్టారని ఓ ప్రకటనలో విమర్శించారు.‘‘ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల జీతాలు తగ్గేలా, వారి నుంచే బకాయిలు వసూలు చేసేలా జగన్ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు, ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు తమ పొట్టకొట్టొద్దంటూ రోడ్లపైకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. కరోనా సమయంలో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, ఆరోగ్య తదితర శాఖల ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందించారు. వారి ఆకాంక్షలకు విరుద్ధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని కాగ్ నివేదిక చెబుతుంటే నిధులు లేవని వేతనాల్లో కోతలు విధిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని గతంలో పలుసార్లు ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఉద్యోగుల న్యాయపోరాటానికి తెదేపా సంపూర్ణ మద్దతు ఇస్తుంది...’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.