AP SSC Exam: మార్పులొచ్చాయ్‌... మార్కులూ రావాలోయ్‌!

పదో తరగతి విద్యార్థులు ఈ ఏడాది భారీ మార్పులతో కూడిన పరీక్షలను రాయబోతున్నారు. ఇకపై 10లో అంతర్గత మార్కులు, ప్రత్యేక బిట్‌ పేపర్‌ . ప్రతి సబ్జెక్టులోనూ 100 మార్కులకు ప్రశ్నలే

Updated : 14 Mar 2022 05:23 IST

సంస్కరణల తర్వాత పది పరీక్షలు

కొత్త విధానంలో సిద్ధమవుతున్న విద్యార్థులు

పదో తరగతి విద్యార్థులు ఈ ఏడాది భారీ మార్పులతో కూడిన పరీక్షలను రాయబోతున్నారు. ఇకపై 10లో అంతర్గత మార్కులు, ప్రత్యేక బిట్‌ పేపర్‌ . ప్రతి సబ్జెక్టులోనూ 100 మార్కులకు ప్రశ్నలే ఉంటాయి.


11 కాదు.. ఇక 7 పేపర్లే...

సామాన్యశాస్త్రం మినహా మిగతా అన్ని సబ్జెక్టులను వంద మార్కుల చొప్పున నిర్వహిస్తారు. ఏడు పరీక్షలుంటాయి. ప్రశ్నపత్రంలోనే మొత్తం 100 మార్కులకు సూక్ష్మ లఘు, తేలికైన, లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు.


జవాబుపత్రం (బుక్‌లెట్‌) ఒక్కటే ఉంటుంది. అందులోనే అన్నింటికీ సమాధానం రాయాలి. అదనంగా జవాబు పత్రాలు ఇవ్వరు.


వంద మార్కుల పరీక్షకు 3.15 గంటల సమయం ఉంటుంది.

ప్రశ్నపత్రం చదువుకునేందుకు 10 నిమిషాలు.. చివర్లో జవాబులు సరిచూసుకునేందుకు మరో ఐదు నిమిషాలు... ఇలా ప్రతి పరీక్షకు అదనంగా 15 నిమిషాల సమయం ఇస్తారు.


ఈనాడు - అమరావతి

పదో తరగతి పరీక్షల్లో రెండేళ్ల క్రితమే సంస్కరణలు ప్రవేశపెట్టారు. 2019-20 విద్యా సంవత్సరంలో ప్రతి సబ్జెక్టులోనూ అంతర్గత మార్కులు, బిట్లు లేకుండా మొత్తం ప్రశ్నలే ఉండేలా మార్పు చేశారు. అయితే కరోనా కారణంగా ఆ ఏడాది పరీక్షలు పెట్టలేదు. గతేడాది 11 పేపర్లను ఏడుకు కుదించినా పరీక్షలు నిర్వహించలేదు. ఈ మార్పులకు అదనంగా ఈ ఏడాది పదిలో మార్కుల విధానాన్ని తీసుకొచ్చారు. పదేళ్లుగా ఉన్న గ్రేడ్ల విధానాన్ని తొలగించారు. ఈసారి కరోనా వల్ల 2 నెలలు ఆలస్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమవడంతో 30% పాఠ్యప్రణాళిక తగ్గించారు. అయినప్పటికీ ఈసారి పిల్లలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది మార్కులిస్తారు.

పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు 2012లో గ్రేడ్‌ పద్ధతిని ప్రవేశపెట్టారు. పోటీ పరీక్షలు, ఇతరత్రా ప్రవేశాలకు మార్కులు అవసరమవుతున్నాయని విద్యార్థులు కోరుతున్నారని గ్రేడ్ల విధానాన్ని తొలగించారు. 600 మార్కులకు జరిగే పరీక్షల్లో 360కి పైగా సాధిస్తే మొదటి డివిజన్‌, 300 నుంచి 359 వరకు రెండో డివిజన్‌, 195 నుంచి 299 వరకు మూడో డివిజన్‌గా మెమోలో పేర్కొంటారు. ఇంతకంటే తక్కువొస్తే డివిజన్‌ ఇవ్వరు. గతంలో 10 మార్కుల వ్యత్యాసంలో ఒక్కటే గ్రేడ్‌ వచ్చేది.. ఇప్పుడు 360కి ఒక్క మార్కు తగ్గినా డివిజన్‌ మారిపోతుంది. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించని 2019-20, 2020-21 బ్యాచ్‌ల విద్యార్థులకు అంతర్గత మార్కులు ఆధారంగా మొదట గ్రేడ్లు, ఆ తర్వాత మార్కులు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని