Budget: వ్యవ‘సాయం’ @ రూ.1.27 లక్షల కోట్లు.. నానో డీఏపీ విస్తరణ.. సమీకృత ఆక్వా పార్క్‌లు

Budget: కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖకు రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో మరింత వృద్ధి కోసం పబ్లిక్‌, ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

Updated : 01 Feb 2024 17:38 IST

దిల్లీ: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయ రంగంలో విలువ జోడింపునకు మరింత కృషి చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ (Union Budget 2024) ప్రసంగంలో ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ద్వారా 38 లక్షల మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూరిందని, 10 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. ‘మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ యోజన’ ద్వారా 2.4 లక్షల స్వయం సహాయక బృందాలు, వ్యక్తిగతంగా మరో 60 వేల మందికి రుణసాయం అందించినట్లు చెప్పారు. పంట కోత అనంతరం నష్టాల నివారణ, దిగుబడి, ఆదాయం పెంపు కోసం వివిధ చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొత్తం మీద వ్యవసాయం, రైతుల సంక్షేమశాఖకు రూ.1.27 లక్షల కోట్లు; మత్స్య, పశుపోషణ, పాడి మంత్రిత్వ శాఖకు రూ.7,105 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు. 

నానో డీఏపీ విస్తరణ

వ్యవసాయ రంగంలో మరింత వృద్ధి కోసం పబ్లిక్‌, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్లు సీతారామన్‌ తెలిపారు. సేకరణ, ఆధునిక నిల్వ వసతులు, సమర్థ సరఫరా వ్యవస్థ, ప్రాథమిక - సెకండరీ ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ వంటి వాటిలో పబ్లిక్‌ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తామన్నారు. నానో యూరియా విధానం విజయవంతమైన నేపథ్యంలో నానో డీఏపీనీ అన్ని అగ్రో - క్లైమేటిక్‌ జోన్లకు విస్తరిస్తామన్నారు. సాధారణంగా బస్తాల్లో డీఏపీ గుళికల రూపంలో ఉంటుంది. అదే నానో డీఏపీతో ద్రవ రూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఎకరానికి అర లీటర్‌ నానో డీఏపీ సరిపోతుందని శాస్త్రవేత్తల అంచనా. రైతులు ఎకరానికి రెండు బస్తాల డీఏపీ వినియోగిస్తుండగా.. సగటున రూ.3 వేలు ఖర్చవుతుంది. నానో డీఏపీ అర లీటర్‌ సీసా ధర రూ.600 ఉంటుందని అంచనా. 

నూనె గింజల్లో స్వయం సమృద్ధి..

2022లో ప్రకటించిన ‘ఆత్మనిర్భర్‌ ఆయిల్‌ సీడ్స్‌ అభియాన్‌’లో భాగంగా ఆవ, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు నూనె గింజల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. అందులో భాగంగా అధిక దిగుబడుల విత్తన రకాలపై పరిశోధన, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతుల అమలు, మార్కెట్ల అనుసంధానం, ధాన్యం సేకరణ, విలువ జోడింపు, పంటల బీమా వంటి అంశాలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు.

పాడి రైతులను ఆదుకుంటాం

పాడి రైతులను ఆదుకునేందుకు సమగ్ర కార్యాచరణను రూపొందిస్తామని సీతారామన్ ప్రకటించారు. గాలికుంటు వ్యాధి నియంత్రణకు ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉందని గుర్తు చేశారు. కానీ, పశువుల పాల దిగుబడి తక్కువగా ఉందన్నారు. ఇప్పటికే ఉన్న రాష్ట్రీయ గోకుల్ మిషన్, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, డెయిరీ ప్రాసెసింగ్ - పశు పోషణ కోసం ‘మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులు’ వంటి పథకాల ఆధారంగా కొత్త ప్రోగ్రాంను రూపొందిస్తామన్నారు.

5 సమీకృత ఆక్వాపార్క్‌లు

మత్స్యకారుల ప్రాముఖ్యతను గుర్తించి తమ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. దీని ఫలితంగా ఆక్వాకల్చర్ ఉత్పత్తి రెండింతలు పెరిగిందన్నారు. 2013-14 నుంచి మత్స్య సంపద ఎగుమతులు రెట్టింపయ్యాయని వెల్లడించారు. ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY)’ అమలును మరికొన్ని లక్ష్యాల సాధనకూ విస్తరిస్తామన్నారు. అందులో భాగంగా ఆక్వాకల్చర్ ఉత్పాదకతను ప్రస్తుతం ఉన్న హెక్టారుకు మూడు టన్నుల నుంచి ఐదు టన్నులకు పెంచుతామన్నారు. ఎగుమతులను రెట్టింపు చేసి రూ.లక్ష కోట్లకు చేర్చుతామని తెలిపారు. సమీప భవిష్యత్తులో ఈ రంగంలో 55 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టిస్తామన్నారు. ఐదు సమీకృత ఆక్వాపార్క్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

పీఎం కిసాన్‌ ఆర్థిక సాయాన్ని ఎన్నికల ముందు ఏటా రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంచుతారని అంచనా వేశారు. కానీ, ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవటం గమనార్హం. అలాగే పంట రుణాల మంజూరు లక్ష్యాన్ని పెంచుతారని ఆశించినా, బడ్జెట్‌లో అలాంటి చర్యలేవీ లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని