‘అలా మోసపోతే బ్యాంకులకు సంబంధం లేదు’

ఫోన్‌ కాల్‌ ద్వారా బ్యాంకు పేరుతో మోసం చేసే కేటుగాళ్లతో మీ ఖాతా వివరాలను పంచుకుంటే ఇక అంతే సంగతులు. ఖాతాలో ఉన్నదంతా ఖాళీ చేసేస్తారు. అందుకే ఈ తరహా ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దని బ్యాంకులు వినియోగదారులను అప్రమత్తం చేస్తుంటాయి....

Published : 18 Mar 2021 01:18 IST

స్పష్టం చేసిన వినియోగదారుల కోర్టు

అహ్మదాబాద్‌: ఫోన్‌ కాల్‌ ద్వారా బ్యాంకు పేరుతో మోసం చేసే కేటుగాళ్లతో మీ ఖాతా వివరాలను పంచుకుంటే ఇక అంతే సంగతులు. ఖాతాలో ఉన్నదంతా ఖాళీ చేసేస్తారు. అందుకే ఈ తరహా ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దని బ్యాంకులు వినియోగదారులను అప్రమత్తం చేస్తుంటాయి. అయినా వినకపోతే బ్యాంకులకు సంబంధం లేదని గుజరాత్‌ అమ్రేలీ జిల్లాకు వినియోగదారుల కోర్టు స్పష్టం చేసింది. ఈ విధంగా మోసానికి గురైన బాధితుడికి బ్యాంకు పరిహారం చెల్లించబోదని తీర్పునిచ్చింది. సదరు బాధితుడు తన నిర్లక్ష్యం వల్లే మోసపోయాడని తీర్పులో పేర్కొంది.

కుర్జీ జావియా అనే ఎస్‌బీఐ ఖాతాదారుడికి 2018లో ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్‌నంటూ ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. సదరు వ్యక్తి జావియా ఏటీఎం కార్డు వివరాలు అడగగా ఆయన ఆ వివరాలను పంచుకున్నారు. ఆ మరుసటి రోజే జావియా ఖాతా నుంచి రూ.41,500 విత్‌డ్రా అయ్యాయి. వెంటనే స్థానిక బ్రాంచికి ఫోన్‌ చేయగా సరైన స్పందన రాలేదు. బ్యాంకు తలుచుకుంటే ఆ మోసాన్ని నివారించగలిగేదని వినియోగదారుల ఫోరంలో జావియా కేసు వేశారు. తాను కోల్పోయిన మొత్తంతోపాటు అదనంగా పరిహారం చెల్లించాలని ఫిర్యాదు చేశారు.

ఈ కేసును విచారించిన కోర్టు.. సురక్షిత లావాదేవీలపై బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలను కుర్జీ జావియా అనుసరించలేదని తేల్చి చెప్పింది. నకిలీ ఫోన్‌కాల్‌ మోసాలపై బ్యాంకు హెచ్చరించినప్పటికీ జావియా నిర్లక్ష్యం వహించారని తీర్పునిచ్చింది. బ్యాంకులు తమ ఖాతాదారుల వివరాలను ఫోన్‌ ద్వారా ఎప్పుడూ అడగవని పేర్కొంది. ఆయన పోగొట్టుకున్న డబ్బుకు బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని