Hyderabad: పేరుకు అమ్మాయే.. మగరాయుడిలా వేషభాష

స్నేహంగా మెలుగుతున్నందుకు చనువుతో పెళ్లి ప్రస్తావన తెచ్చిన యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన యువతికి గురువారం బెయిలు లభించింది.

Updated : 09 Dec 2022 12:15 IST

హైదరాబాద్‌: స్నేహంగా మెలుగుతున్నందుకు చనువుతో పెళ్లి ప్రస్తావన తెచ్చిన యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన యువతికి గురువారం బెయిలు లభించింది. పోలీసులు, స్థానికులు వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ) భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటున్నారు. ఆయన కుమార్తె లక్ష్మీ సౌమ్య(23) బీబీఏ పూర్తిచేసింది. ఈమెకు తండ్రితో విభేదాలు రావడంతో 6 నెలల క్రితం నగరానికి వచ్చేసింది. క్రికెట్‌ కోచింగ్‌తోపాటు ఉద్యోగ ప్రయత్నం నిమిత్తం వచ్చానంటూ కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని శ్రీ తనూజ హాస్టల్‌లో చేరింది.

సాధారణంగా రాత్రి 10 గంటలకు హాస్టల్‌ గేట్లు మూసేస్తారు. కానీ లక్ష్మీ సౌమ్య మాత్రం నిత్యం ఆలస్యంగా చేరుకునేది. దీంతో ఆమె ప్రవర్తన నచ్చక హాస్టల్‌ నిర్వాహకులు ఆమెను ఖాళీ చేయించగా తొమ్మిదో ఫేజ్‌లో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటోంది. పేరుకు అమ్మాయే అయినా మగరాయుడిలా కనిపించేది. ఆమె వేషధారణ, భాష అంతా విభిన్నంగా ఉండేది. ఈమె హాస్టల్‌లో ఉన్నప్పుడు అక్కడికి సమీపంలోనే ఉన్న దేవీ లగ్జరీ బాయ్స్‌ హాస్టల్‌లో గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్‌కుమార్‌ (27) 7 నెలలుగా ఉంటూ ఎస్‌ఏపీ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఇతని సోదరి కూడా సమీపంలోని హాస్టల్‌లోనే ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేది. అశోక్‌కుమార్‌, లక్ష్మీ సౌమ్య నిత్యం ఓ టీ స్టాల్‌కు వెళ్లేవారు. అక్కడ పరిచయం ఏర్పడి రోజూ కలుసుకుని మాట్లాడుకునేవాళ్లు.

ఈక్రమంలో లక్ష్మీ సౌమ్యకు అవసరమై అప్పుడప్పుడు అశోక్‌కుమార్‌ కొంత నగదు ఇచ్చాడు. అలా చనువుకొద్దీ ఆమెతో పెళ్లి ప్రస్తావన తెచ్చేవాడు. ఆమె మౌనం వహించేది. ఈనెల 5న అశోక్‌కుమార్‌ పుట్టినరోజు ఉండటంతో ఖర్చులకు తానిచ్చిన డబ్బులు ఇవ్వమని లక్ష్మీ సౌమ్యని అడిగాడు. దానిపై మాటమాట పెరిగి డబ్బులు ఇవ్వకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అశోక్‌ అనడంతో లక్ష్మీ సౌమ్య ఆగ్రహంతో ఊగిపోయింది. తన వద్ద ఉన్న చాకు లాంటి మినీ కట్టర్‌తో అశోక్‌కుమార్‌పై దాడి చేసింది. ప్రస్తుతం ఇతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. అతని ముఖానికి సంబంధించిన నరం తెగిందని, ముఖం ఎడమ వైపు పక్షవాతం వచ్చిందని, రెండు రోజుల్లో డిశ్ఛార్జ్‌ అవుతాడని వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని