వేధించాడని.. కొట్టి చంపి కాల్చేశారు

వేధిస్తున్నాడని ఒక యువకుడిని యువతి కుటుంబసభ్యులు దారుణంగా హత్య చేసి.. కాల్చేసి పొదల్లో పడేశారు. ఈ హత్య ఘటనను పోలీసులు వారం రోజుల్లోనే

Published : 18 Sep 2021 04:18 IST

వారం రోజుల్లో హత్య కేసు ఛేదించిన పోలీసులు

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే: వేధిస్తున్నాడని ఒక యువకుడిని యువతి కుటుంబసభ్యులు దారుణంగా హత్య చేసి.. కాల్చేసి పొదల్లో పడేశారు. ఈ హత్య ఘటనను పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర శుక్రవారం విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు.

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం మాకోడకు చెందిన బురత్కర్‌ చైతన్య(22).. 2018లో ఉపాధి శిక్షణ పొందుతున్న సమయంలో ఓ యువతిని వేధించేవాడు. ఆమెకు వివాహమైనా చైతన్య ఆగడాలు మానలేదు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు పథకం ప్రకారం.. ఈనెల 9న ఆమె ద్వారా చైతన్యకు ఫోన్‌ చేయించి ఇంటికి పిలిపించారు. రాగానే ఏడుగురు కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేశారు. పార, కట్టెలతో కొట్టి ప్రాణాలు తీశారు. అనంతరం పరుపులో చుట్టి ఇల్లు ఖాళీ చేస్తున్నట్లు నటిస్తూ మృతదేహాన్ని ఆటోలో వేసుకొని బయటపడ్డారు. తోవలో పెట్రోలు కొని, తలమడుగు మండలం దేవాపూర్‌ శివారులో మృతదేహాన్ని తగలబెట్టారు. బాధితుడి కుటుంబ సభ్యులు చైతన్య కనిపించటం లేదని ఆదిలాబాద్‌ ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదైంది. దేవాపూర్‌ శివారులో కాలిన శవం గుర్తించిన తలమడుగు ఎస్‌ఐ దివ్యభారతి ఈ నెల 14న కేసు నమోదు చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ ప్రత్యేకంగా డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. కాలిన శవం చైతన్యదిగా నాలుగు రోజుల్లోనే పోలీసులు గుర్తించారు. ఫోన్‌ వివరాలు, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుల వివరాలు తెలుసుకున్నారు. నిందితులు ఏడుగురినీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని