ఆమె ప్రేమ.. ముగ్గురి ఊపిరి తీసింది

ప్రేమించిన యువకుడితో తమ ఇంటి ఆడపిల్ల వెళ్లిపోయిందన్న బాధతో ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లా శిడ్లఘట్ట తాలూకా హండిగనాళ గ్రామంలో చోటు చేసుకుంది.

Published : 05 Oct 2022 03:54 IST

కుమార్తె వెళ్లిపోయిందని తల్లిదండ్రులు, సోదరుడి ఆత్మహత్య

కోలారు, న్యూస్‌టుడే: ప్రేమించిన యువకుడితో తమ ఇంటి ఆడపిల్ల వెళ్లిపోయిందన్న బాధతో ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లా శిడ్లఘట్ట తాలూకా హండిగనాళ గ్రామంలో చోటు చేసుకుంది. శ్రీరామప్ప (63), ఆయన భార్య సరోజమ్మ (58), వీరి కుమారుడు మనోజ్‌ (24) విషం తాగి తనువు చాలించారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరామప్ప దంపతులకు మనోజ్, రంజిత్‌తోపాటు మరో కుమార్తె ఉన్నారు. ఎంఎస్సీ పూర్తి చేసిన కుమార్తెకు వివాహ సంబంధాన్ని చూశారు. బుధవారం నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాను ప్రేమించిన.. హండిగనాళ గ్రామానికే చెందిన నారాయణ స్వామి అనే క్యాబ్‌ డ్రైవర్‌నే వివాహం చేసుకుంటానని ఆ యువతి గట్టిగా చెప్పి ఆయనతో ఆమె ఆదివారం రాత్రి వెళ్లిపోయింది. ఆమె కోసం తన ఇద్దరు కుమారులతో కలిసి శ్రీరామప్ప అన్ని చోట్లా వెతికారు. ఇదే బాధతో మనోజ్‌తో కలిసి వారు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. రంజిత్‌ మంగళవారం ఉదయం నిద్రలేచిన తర్వాత తన తమ్ముడు, తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించారు. శిడ్లఘట్ట గ్రామీణ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని