పెళ్లిబస్సు ప్రమాదంలో.. 33కి పెరిగిన మృతులు

ఉత్తరాఖండ్‌లోని పౌడీ జిల్లాలో మంగళవారం రాత్రి పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయిన దుర్ఘటనలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 07 Oct 2022 05:00 IST

19 మందికి గాయాలు

పౌడీ: ఉత్తరాఖండ్‌లోని పౌడీ జిల్లాలో మంగళవారం రాత్రి పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయిన దుర్ఘటనలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. 19 మంది గాయపడ్డారు. హరిద్వార్‌ జిల్లాలోని లాల్‌ఢాంగ్‌ నుంచి వెళ్తున్న బస్సు పౌడీ జిల్లాలోని బిరోన్‌ఖల్‌ వద్ద అదుపుతప్పి 500 మీటర్ల లోతున్న నాయర్‌ నది లోయలో పడిపోయింది. గాయపడ్డవారిలో కొందరు.. అతి కష్టం మీద లోయ నుంచి రోడ్డు పైకి వచ్చి అటుగా వెళ్తున్న వారికి ప్రమాద విషయం తెలిపారు. వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ఘటనలో మొత్తం 33 మంది చనిపోయారని, 19 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

12 గంటలపాటు తల్లి మృతదేహంతో రెండేళ్ల పాప

ఈ ప్రమాదం నుంచి రెండేళ్ల పాప మృత్యుంజయురాలిగా బయటపడింది. చనిపోయిన తల్లి గుండెను హత్తుకుని, బిక్కుబిక్కుమంటూ గడుపుతూ.. 12 గంటల తర్వాత సహాయక సిబ్బంది కంటపడింది. పెళ్లి కుమారుడి బంధువైన గుడియా దేవి, ఆమె రెండేళ్ల కుమార్తె దివ్యాంశీ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఉన్నారు. బస్సు అదుపు తప్పిందని గుర్తించిన వెంటనే గుడియా దేవి.. కుమార్తెను గట్టిగా పట్టుకుంది. తల్లి ప్రాణాలు కోల్పోగా.. బిడ్డ మాత్రం అలానే ఆమె గుండెను హత్తుకుని ఉండిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని