logo

పాలు లేకుండా కోవా

పాలకోవా చూడగానే ఎవరికైనా నోరూరాల్సిందే. మొఘల్‌పురలోని దేశీ డెయిరీలో కోవా తయారీ తీరు చూస్తే మాత్రం వాంతులు తప్పవు. అంతటి దుర్గంధం, వ్యర్థాలు, అపరిశుభ్రత మధ్య కోవా తయారుచేస్తున్నారు.

Published : 08 Jun 2023 03:56 IST

పాలపొడి, మురికినీళ్లు, రవ్వ కలిపి తయారీ

మొఘల్‌పుర డెయిరీ తనిఖీలో అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: పాలకోవా చూడగానే ఎవరికైనా నోరూరాల్సిందే. మొఘల్‌పురలోని దేశీ డెయిరీలో కోవా తయారీ తీరు చూస్తే మాత్రం వాంతులు తప్పవు. అంతటి దుర్గంధం, వ్యర్థాలు, అపరిశుభ్రత మధ్య కోవా తయారుచేస్తున్నారు. అది కూడా.. పాలు లేకుండానే. దేశీ డెయిరీలో తయారయ్యే ఈ అనారోగ్యకర పాలకోవాను నిర్వాహకులు నగరమంతా సరఫరా చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడులతో విషయం వెలుగులోకి వచ్చింది.

వాసన కోసం వనస్పతి, కల్తీ నూనె..

* రాజస్థాన్‌ సర్కారు అక్కడి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు ‘ముఖ్యమంత్రి బాల్‌ గోపాల్‌ యోజన’ పేరుతో పాలపొడి ప్యాకెట్లు పంపిణీ చేస్తోంది. ఇవి నగరానికి అక్రమంగా రవాణా అవుతున్నాయి. వాటిని మొఘల్‌పుర ప్రాంతానికి చెందిన దేశీ డెయిరీ కోవా తయారీ కోసం వినియోగిస్తోంది.

* టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఫిర్యాదు అందగా, పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఆహార కల్తీ నియంత్రణాధికారి సిరాజ్‌ అహ్మద్‌ కలిసి డెయిరీపై దాడి చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు కేంద్రానికి అనుమతిలేదు. నిబంధనలకు విరుద్ధంగా భవనం సెల్లారులో వంట గది నడుస్తోంది. కోవా తయారీకి వాడే పాత్రలు మురికిగా ఉన్నాయి. సెల్లారులో మురుగు కాలువలున్నాయి. వాటికి పైకప్పులు లేవు. బొద్దింకలు, బూజు, చెత్తకుప్పలున్నాయి. వాటి మధ్యే వంట మనుషులు కోవా తయారుచేసి ప్యాకింగ్‌ చేస్తున్నారు.

* పాలపొడిలో మురికినీళ్లు కలిపి, నాసిరకం రవ్వ వేసి మరగకాస్తున్నారు. మిశ్రమం నుంచి మంచి పాలు, నెయ్యి వాసన వచ్చేందుకు వనస్పతి, కల్తీ నూనె కలుపుతున్నారు.

* అక్కడి పలు ఇతర కేంద్రాల్లోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే కోవా తయారవుతోంది. డెయిరీ యజమానిపై బల్దియా కేసు నమోదుచేసింది. కోవా నమూనాలు ప్రయోగశాలకు పంపామని, నివేదిక వచ్చాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పాలపొడి అక్రమ రవాణా, డొమెస్టిక్‌ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తుండటం, ఇతరత్రా అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని ‘నకిలీ’ కేంద్రాలు..

పాతబస్తీ కేంద్రంగా మరిన్ని నకిలీ వస్తు తయారీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇటీవలే కాటేదాన్‌లో నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ బయటపడిన విషయం తెలిసిందే.. ఐస్‌క్రీం, చాకెట్ల తయారీ కేంద్రాల్లోనూ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, వరుస దాడులతో నకిలీ కేంద్రాల గుట్టు రట్టవుతోందని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.

అక్రమంగా తెచ్చిన ‘రాజస్థాన్‌’ పాలపొడి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని