logo

విషాదం నింపిన ఈత సరదా.. ఇద్దరు యువకుల మృతి

యువకుల ఈత సరదా ఆ కుటుంబంలో విషాదం నింపింది. పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకుల్లో ఇద్దరు మృతిచెందారు.

Published : 01 May 2024 04:22 IST

అనంతసాగరం, న్యూస్‌టుడే: యువకుల ఈత సరదా ఆ కుటుంబంలో విషాదం నింపింది. పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకుల్లో ఇద్దరు మృతిచెందారు. మండలంలోని పాతాళపల్లి సమీపంలో మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పాతాళపల్లికి చెందిన మిట్టమాల వంశీకృష్ణ(25), మిట్టమాల పెంచల నరసింహులు(23) నెల్లూరుకు చెందిన మరో ముగ్గురితో కలసి పెన్నానదిలో స్నానానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఉప్పలపాడు గ్రామం వద్ద వంతెన కింద పెన్నా నదిలో ఈతకు వెళ్లారు. ముందుగా ఈతరాని పెంచల నరసింహులు నదిలోకి దిగి ఒక్కసారిగా అందులో మునిగిపోయారు. గమనించిన అన్న వంశీకృష్ణ తమ్ముడిని కాపాడే క్రమంలో నదిలోకి దిగి తానూ గల్లంతయ్యారు. పక్కనే ఉన్న స్నేహితులు గమనించి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వారు చరవాణి ద్వారా తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృత్యువాత పడిన వంశీకృష్ణ మృతదేహాన్ని వెలికి తీశారు. గాలింపు అనంతరం నరసింహులు మృతదేహం బయటపడింది. ఆత్మకూరు సీఐ వేణు, ఎస్‌.ఐ.లు సుబ్బారావు, ముత్యాలరావు, అయ్యప్ప గజ ఈతగాళ్లతో శవాలను వెలికితీయించారు. మిట్టమాల చిన్న వెంకటయ్య, పెంచలమ్మ దంపతులకు ముగ్గురు కుమారుల్లో వంశీకృష్ణ, పెంచల నరసింహులు రెండు, మూడోవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని