Kamal Nath: అక్కడి ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో 50 ఓట్లు రాలేదట!
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు (Congress) ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో కనీసం 50ఓట్లు కూడా రాలేదని మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో (Madhya Pradesh Polls) ఊహించని ఫలితాలు వచ్చాయని.. అవి నమ్మశక్యంగా లేవని అక్కడి కాంగ్రెస్ నేతలు ఆక్రోశిస్తున్నారు. పలువురు (Congress) ఎమ్మెల్యేలకు వారి వారి సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలు తనవద్ద చెప్పి వాపోయారని అన్నారు.
‘మధ్యప్రదేశం’ మళ్లీ కమలానిదే.. ఐదోసారి అధికారంలోకి భాజపా
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకునేందుకు గాను అభ్యర్థులతో రాష్ట్ర కాంగ్రెస్ మంగళవారం భోపాల్లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ముందు కమల్నాథ్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసు. మా పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఈ ఉదయం నన్ను కలిశారు. వారికి వాళ్ల సొంత గ్రామాల్లో కేవలం 50 ఓట్లే వచ్చాయని చెప్పారు. ఇదెలా సాధ్యం?’ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది. 230 స్థానాలకుగాను కేవలం 66 చోట్ల మాత్రమే విజయం సాధించింది. అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే 48 స్థానాలను కోల్పోయింది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై స్థానిక కాంగ్రెస్ నాయకులు అనుమానాలతోపాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.