అభ్యర్థిని పట్టుదల.. ఆంబులెన్స్‌లోనే పీఎస్‌సీ పరీక్ష

కేరళలోని తిరువనంతపురానికి చెందిన పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ అభ్యర్థిని ఆంబులెన్స్‌లోనే పరీక్ష రాసి వార్తల్లో నిలిచింది. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు యువతి ప్రదర్శించిన పట్టుదల ప్రశంసలందుకుంటోంది...

Published : 04 Nov 2020 00:58 IST

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురానికి చెందిన  అభ్యర్థిని ఆంబులెన్స్‌లోనే పరీక్ష రాసి వార్తల్లో నిలిచింది. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు యువతి ప్రదర్శించిన పట్టుదల ప్రశంసలందుకుంటోంది. గోపిక గోపన్‌ అనే యువతి కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (పీఎస్‌సీ) పరీక్షల కోసం కొన్నేళ్లనుంచి సిద్ధమవుతోంది. సోమవారం పరీక్ష రాయాల్సి ఉండగా శనివారం గోపికకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. అయినప్పటికీ కొద్దికాలంగా తాను పడుతున్న శ్రమ వృథాగా పోకూడదని, ఎలాగైనా పరీక్ష రాయాలని ఆమె నిర్ణయించుకుంది. ఆంబులెన్స్‌లోనే పరీక్ష రాసేందుకు సిద్ధమైంది. పరీక్షా కేంద్రమైన పాఠశాల ముందు ఆంబులెన్స్‌లోనే పరీక్ష రాసేందుకు ఏర్పాట్లుచేయగా అందులోనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత పరీక్ష రాసింది. పరీక్ష రాయడం ప్రారంభించాక ఎలాంటి ఇబ్బంది కలగలేదని గోపిక వెల్లడించింది.

గోపన్‌ అంకిత భావాన్ని అనేక మంది కొనియాడుతున్నారు. తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ సైతం ఆమెను ప్రశంసించారు. ఓ వార్తా పత్రికలో ప్రచురితమైన గోపన్‌ కథనాన్ని ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ‘ప్రతికూలతలను ఎదుర్కొని తన ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు గోపన్‌ కనబరిచిన సంకల్పానికి నా సెల్యూట్‌. నా నియోజకవర్గానికే చెందిన ఆమె తెగువ పట్ల గర్వంగా ఉంది’ అని గోపికను కొనియాడారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని