ఎస్‌ఈసీ ఉత్తర్వులను నిలిపివేసిన హైకోర్టు

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి మూడు చోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.

Updated : 03 Mar 2021 15:13 IST

అమరావతి: మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పలు చోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. గత మార్చిలో పురపాలక ఎన్నికల నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు పలుచోట్ల తిరిగి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అనుమతించారు. దీంతో నిన్న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువుగా రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే.. ఎస్‌ఈసీ నిర్ణయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎస్‌ఈసీ ఆదేశాలను నిలుపుదల చేసింది. 

వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవద్దు

ఏపీలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల సేవలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ‘‘పంచాయతీ ఎన్నికల్లాగే వార్డు వాలంటీర్లపైనా ఫిర్యాదులు వచ్చాయి. రాజకీయ కార్యకలాపాలకు వారు దూరంగా ఉండాలి. మున్సిపల్‌ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరుగుతాయి. స్వేచ్ఛాయుత ఎన్నికలకు వాలంటీర్లపై కఠినచర్యలు అవసరం. రాజకీయ ప్రక్రియ నుంచి వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలి. అభ్యర్థికి, పార్టీకి అనుకూలంగా వాళ్లు పాల్గొనకూడదు. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదు. ఓటరు స్లిప్పుల పంపిణీని వార్డు వాలంటీర్లకు అప్పగించవద్దు. వారి కదలికలను నిశితంగా పరిశీలించాలి. లబ్ధిదారుల డేటా దృష్ట్యా వాలంటీర్ల ఫోన్లను నియంత్రించాలి. కమిషన్‌ ఆంక్షలు ఉల్లంఘిస్తే కోడ్‌ ఉల్లంఘనగా పరిగణిస్తాం. సాధారణ బాధ్యతలు నిర్వహించే వాలంటీర్లకు అడ్డంకుల్లేవు’’ అని ఎస్‌ఈసీ  స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం వాలంటీర్లపై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేసింది. వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవద్దని స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని