TTD: తిరుమలలో డ్రోన్‌ కలకలం.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌

తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో వీడియో తీసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం కలకలం రేపింది. అప్రమత్తమైన తితిదే విజిలెన్స్‌ విభాగం ఆడియో నిజమైందా కాదా అనేదానిపై విచారణ చేపట్టింది. 

Published : 21 Jan 2023 01:35 IST

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన వీడియో ఒకటి కలకలం సృష్టించింది. ఈ వీడియో శుక్రవారం సాయంత్రం సోషల్‌ మీడియాలో కనిపించడంతో తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. విమానాలను సైతం శ్రీవారి ఆలయం వైపునకు వెళ్లకుండా చూడాలని గతంలోనే పలువురు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంపై నుంచి డ్రోన్‌ ద్వారా చిత్రీకరించిన వీడియో ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. డ్రోన్‌తో చిత్రీకరించినా తితిదే విజిలెన్స్‌ అధికారులు గుర్తించలేకపోవడం భద్రతా వైఫల్యంగా భక్తులు భావిస్తున్నారు. శ్రీవారి ఆలయం ఎదుట గొల్లమండపంపై, శ్రీవారి ఆలయంపైన నిరంతరం భద్రతా సిబ్బంది నిఘా ఉంటుంది. అలాంటిది భద్రతా సిబ్బంది ఎవరూ ఈ డ్రోన్‌ చిత్రీకరణను గుర్తించలేకపోయారు. మరోవైపు తిరుమల వ్యాప్తంగా 1600కు పైగా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. అందులోనూ ఈ డ్రోన్‌ వ్యవహారం బయటపడకపోవడం గమనార్హం. 

విచారణ చేస్తున్నాం: బాలిరెడ్డి, వీజీవో

‘‘తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్‌తో చిత్రీకరణకు సంబంధించిన వీడియో నిజమైందా? కాదా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం. సైబర్‌ క్రైమ్‌లో దీనిపై తనిఖీ చేస్తున్నాం. గతేడాది నవంబర్‌లో ఈ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించాం. పూర్తిస్థాయిలో తనిఖీచేసి ఈ వీడియో అసలైందా? నకిలీదా? అని గుర్తించి చర్యలు తీసుకుంటాం’’ అని వీజీవో బాలిరెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని