Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Apr 2024 09:12 IST

1. యువత కలలపై జగన్‌ ‘బండరాయి’!

కరవు సీమ అనంతను పారిశ్రామిక కేంద్రంగా మారుస్తాం.. జిల్లాలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తాం.. తద్వారా భారీగా ఉపాధి కల్పిస్తామంటూ 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్‌ ఈ జిల్లా ప్రజలకు అర చేతిలో స్వర్గం చూపించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ‘కియా’ పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి లభించేలా ప్రాధాన్యం ఇప్పిస్తామనీ కల్లబొల్లి మాటలూ చెప్పారు. వేలమందికి ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్‌ పరిశ్రమలను ఉద్ధరిస్తామంటూ ప్రగల్భాలు పలికారు. పూర్తి కథనం

2. రైతులను అధోగతి పాల్జేసి పరామర్శలా?

ప్రకృతి వైపరీత్యాలను, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా విపక్ష భారాస నేతలు చూపుతున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. వారు చేసిన నిర్వాకాలన్నింటినీ.. తమ ప్రభుత్వంపై నెట్టివేస్తున్నారని, అలాంటి చర్యలను రాష్ట్ర ప్రజలు హర్షించరని తెలిపారు. రైతులను అథోగతి పాల్జేసి, ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు పరామర్శకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు.పూర్తి కథనం

3. 400 కాదు.. కనీసం 200 సీట్లైనా గెలవండి

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామంటున్న భాజపా కనీసం 200 స్థానాల్లోనైనా విజయం సాధించి చూపెట్టాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాల్‌ విసిరారు. 2021 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 200 స్థానాలు గెలుస్తామన్న భాజపా 77 సీట్లకే పరిమితమైందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మమత పాల్గొని ప్రసంగించారు.పూర్తి కథనం

4. ‘బ్లాక్‌’లో టికెట్ల విక్రయం

చెన్నై సూపర్‌కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు చెన్నై ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీపైనే. ఈ మ్యాచ్‌కున్న డిమాండ్‌ దృష్ట్యా దిల్లీ జట్టు యాజమాన్యం, నిర్వాహకులు టికెట్ల విషయంలో అభిమానులను దోచుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విక్రయాలతో తమకేమీ సంబంధం లేదని చెబుతున్న ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌.. వైకాపా నాయకులకు పెద్దఎత్తున టికెట్లు కేటాయించినట్లు సమాచారం.పూర్తి కథనం

5. పోలీసు అధికారులు కావలెను!

రాజధానిలోని మూడు పోలీస్‌ కమిషనరేట్లలో కీలక విభాగాలు సారథుల్లేకుండానే కొనసాగుతున్నాయి. అదనపు, సంయుక్త కమిషనర్లు, డీసీపీ పోస్టులు నెలలపాటు ఖాళీగా ఉన్నాయి. ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పోస్టు దాదాపు నెలనుంచి ఖాళీగానే ఉంది. విశ్వప్రసాద్‌ బదిలీ తర్వాత ఎవరినీ నియమించలేదు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది.పూర్తి కథనం

6. సొంత ఫోన్లలోనే వాలంటీర్ల సర్వేలు.. లబ్ధిదారుల సమాచారం

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండేందుకే వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టామని జగన్‌ సర్కార్‌ తొలినాళ్లలో ఘనంగా చెప్పింది. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా పారదర్శకంగా వీరు సేవలందిస్తారని ముఖ్యమంత్రి సెలవిచ్చారు. వైకాపా మద్దతుదారులనే వాలంటీర్లుగా నియమించారని తొలుత ప్రతిపక్షాలు విమర్శించినా అధికార పార్టీ నాయకులు ఖండించారు. వాలంటీర్లంటే ఎవరో కాదు.. వైకాపా కార్యకర్తలేనని కొంతకాలానికి నేతలు బహిరంగంగానే అంగీకరించారు. పూర్తి కథనం

7. తెదేపా వల్ల పింఛన్లు ఆగిపోయాయని చెప్పండి.. వాలంటీర్లకు వైకాపా వాట్సప్‌ సందేశాలు

ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైకాపా మరింతగా బరితెగిస్తోంది. ప్రభుత్వ పథకాల పంపిణీకి వాలంటీర్ల సేవలు వినియోగించుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాలకు వక్రభాష్యం చెబుతూ.. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందే కుట్రను కొనసాగిస్తోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయించవద్దని ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలిస్తే.. దానికి తెదేపానే కారణమంటూ వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఆదివారం కూడా దుష్ప్రచారం చేసింది. పూర్తి కథనం

8. పాతబస్తీని చుట్టేస్తున్న నగరం

పాతబస్తీకి రంజాన్‌ కళ అత్తరులా వ్యాపించింది. రాత్రి అయితే చాలు నగరమంతా పాతబస్తీలో గడుపుతోంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 4 వరకూ పాతబస్తీలోని మదీన సెంటర్‌ కిక్కిరిసిపోతోంది. పగలంతా ఎండ వేడితో ఇంట్లోంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి. పాతబస్తీలో మధ్యాహ్నం 2 గంటల నుంచి వ్యాపారం మొదలై తెల్లవారుజాము వరకూ కొనసాగుతోంది.పూర్తి కథనం

9. టానిక్‌ ఏర్పాటు జీవోలోనే మతలబు!

హైదరాబాద్‌లోని టానిక్‌ మద్యం దుకాణం, దాని అనుబంధ క్యూ దుకాణాలు జీఎస్టీ, వ్యాట్‌, ప్రివిలేజ్‌ ఫీజుల్లో ఎగవేతలకు పాల్పడినట్లు ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖల అధికారులు ఆయా దుకాణాల్లో సోదాలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.పూర్తి కథనం

10. అయోధ్యకు నేరుగా విమాన సౌకర్యం

హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సౌకర్యం ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. వారానికి మూడు రోజుల చొప్పున మంగళ, గురు, శనివారాల్లో విమాన సదుపాయం ఉంటుందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ఆదివారం వెల్లడించారు. అయోధ్యకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్‌-అయోధ్య మధ్య విమాన సర్వీసు ప్రారంభించాలని ఫిబ్రవరి 26న కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాసినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు