Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Aug 2023 13:13 IST

1. సీఎంని రావొద్దని నేనే చెప్పా: కాంగ్రెస్‌ విమర్శలపై మోదీ స్పష్టత

శనివారం ఉదయం బెంగళూరుకు వచ్చిన ప్రధాని మోదీ(Modi)కి స్వాగతం పలికేందుకు.. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరిలో ఎవరూ హాజరుకాలేదు. మోదీ ఉద్దేశపూర్వకంగానే వారిని ఎయిర్‌పోర్టుకు రావొద్దన్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అందుకు ప్రధాని నరేంద్రమోదీనే స్వయంగా స్పష్టత ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఉప్పుడు బియ్యంపై కీలక నిర్ణయం.. ఎగుమతులపై 20 శాతం సుంకం

ఉప్పుడు బియ్యం (parboiled rice) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడంతో పాటు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం కోసం ఎగుమతులపై 20 శాతం సుంకం (export duty) విధించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) తాజాగా ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘పుష్ప’ సినిమాలో నా ఫొటో పెట్టారని.. వైకాపా వాళ్లు ఏడుస్తున్నారు: చంద్రబాబు

అల్లు అర్జున్ (Allu arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలో తన ఫొటో పెట్టారని.. వైకాపా వాళ్లు ఏడుస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తాజాగా విలేకర్లతో జరిపిన ఇష్టాగోష్టిలో ఆయన (Chandrababu) ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పుష్ప’లో ఎర్రచందనం స్మగ్లర్‌గా తన నటనతో మెప్పించిన అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు ఇచ్చినప్పుడు.. వైకాపాలోని నిజమైన స్మగ్లర్లకు ఏ అవార్డు ఇవ్వాలి?’’ అని ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలంగాణకు కోకాకోలా మరిన్ని పెట్టుబడులు.. మంత్రి కేటీఆర్‌తో వెల్లడి

 తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోకాకోలా సంస్థ (Coca-Cola Company) నిర్ణయించింది. తాజాగా తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌ (Minister KTR)కు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్ మేక్ గ్రివి సమావేశమయ్యారు. తమ సంస్థకు భారత్‌ మూడో అతిపెద్ద మార్కెట్‌ అని, తమ కార్యకలాపాలను విస్తరించే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు జేమ్స్‌ చెప్పారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమ్మానాన్న క్షమించండి.. సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

అమ్మానాన్న క్షమించండంటూ.. ఓ బీటెక్‌ విద్యార్థి సూసైడ్‌ నోటి రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ మధురానగర్‌లో ఈ ఘటన జరిగింది. మధురానగర్‌కు చెందిన ద్రితేక్షణ్‌ వర్మ ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. పరీక్షలో ఫెయిల్‌ అవుతాననే భయంతో సూసైడ్‌ నోట్‌ రాసి శనివారం ద్రితేక్షణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మైనంపల్లి ఇంటికి భారీగా అభిమానులు.. ఎమ్మెల్యే నిర్ణయంపై ఉత్కంఠ

మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసం వద్ద ఉత్కంఠ నెలకొంది. మైనంపల్లి నివాసానికి మల్కాజిగిరి, మెదక్‌ నియోజకవర్గాల నుంచి భారాస కార్యకర్తలు, కార్పొరేటర్లతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్‌ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృత చర్చ జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అల్లూ వారి విల్లుకు.. తెలుగు వారి బాకీ చెల్లు: తనికెళ్ల భరణి

టాలీవుడ్‌లో చరిత్ర సృష్టిస్తూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (Allu arjun) జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు రెండు రోజుల నుంచి ప్రశంసలు , శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపగా.. తాజాగా నటుడు తనికెళ్ల భరణి (Tanikella Bharani) తనదైన శైలిలో అల్లు అర్జున్‌కు విషెస్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ట్రంప్‌ మగ్‌షాట్‌ ఫొటో.. అందంగా ఉన్నారంటూ బైడెన్‌ సెటైర్

అమెరికా చరిత్రలోనే మగ్‌షాట్‌ (Mug Shot) తీయించుకొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌  (Donald Trump) నిలిచారు. దీంతో అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ట్రంప్‌ మగ్‌షాట్‌ ఫొటోపై సెటైర్‌ వేశారు. తాహోలోని వ్యాయామ క్లాస్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 16వ వివాహ వార్షికోత్సవం.. యువగళంలో కేక్‌ కట్‌ చేసిన లోకేశ్‌

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 195వ రోజు కొనసాగుతోంది. నూజివీడు నియోజవకర్గంలోని పోతిరెడ్డిపల్లికి లోకేశ్‌ చేరుకున్నారు. అరిసెలతో తయారు చేసిన గజమాలతో గ్రామస్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇవాళ లోకేశ్, బ్రాహ్మణిల 16వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా యువగళం వాలంటీర్లు, తెదేపా శ్రేణులు ఆయనతో కేక్ కట్ చేయించారు. అనంతరం చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి, పిట్టలవారి పాలెం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించాలని గ్రామస్థులు లోకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హమ్‌ చేస్తే మీకు నచ్చిన పాట.. యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌!

వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. సాంగ్‌ సెర్చ్‌ (Song Search) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన పాటను సులువుగా వెతకొచ్చు. యూట్యూబ్‌లోని వాయిస్‌ సెర్చ్‌ ఫీచర్‌ ద్వారా సాంగ్‌ సెర్చ్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. గూగుల్‌ సెర్చ్‌లోని హమ్‌ టు సెర్చ్‌ (Hum To Search) ఫీచర్‌ స్ఫూర్తితో ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు యూట్యూబ్‌ తెలిపింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు